పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు
వివిధ రూపాల్లో పోరాటం ఉధృతం
స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం ఆగదు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
తెలంగాణ వడ్లను కొనుగోలు చేయాల్సిందే..
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్మీ పోరాటం వర్ధిల్లాలి.. అన్నదాతల సంక్షేమం విలసిల్లాలి
రైతు వ్యతిరేక కేంద్రంపై పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతు పలికిన కర్షకులు
సిద్దిపేట, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన హామీనివ్వాలని బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసన తెలియజేశారు. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని ఫ్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి అన్ని పార్టీలు మద్దతు తెలియజేశాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ నిరసనను తెలియజేశారు. తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ స్పష్టం చేశారు. రెండు రోజులుగా ఎంపీలు తమ నిరసన తెలియజేస్తే బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడడం లేదన్నారు. పార్లమెంట్లో ధాన్యం సేకరణపై స్పష్టత కోసం టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి రైతులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలో ఒక మాట..రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతున్న బీజేపీ నాయకుల తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 12 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి మహాధర్నాను చేపట్టింది. నవంబర్ 18న రాష్ట్ర రాజధానిలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు.
స్పష్టమైన హామీ ఇవ్వాలి
యాసంగి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదు. పార్లమెంట్లో తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. తమ పోరాటానికి అన్ని పార్టీల వారు మద్దతు ఇచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ .. ధాన్యం కొనుగోలు మాకేంటి సంబంధం అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ ? అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత …ఇది తెలియ కుండా ధాన్యం కొనుగోలు చేయం అని పార్లమెంట్లో చెప్పడంపై తమతో పాటు అన్ని పార్టీల వారు తమ నిరసన తెలియజేశారు. బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒక మాట .. గల్లీలో ఉన్న వారు ఒక మాట మాట్లాడుతారు. బీజేపీ నాయకులు పొంతన లేని మాటలతో రైతులను అయోమయంలో పడేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తాం. యాసంగి ధాన్యం సేకరణపై లిఖిత పూర్వక హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.