చలాన్లకు చిక్కకుండా మాయాజాలం
నంబర్లు ఎగురగొడుతూ.. ప్లేట్లు వంచుతున్న ఉల్లంఘనులు
జిల్లాలో ఈ ఏడాది 7,585 కేసులు నమోదు
కఠిన చర్యలు తప్పవుఅంటున్న ట్రాఫిక్ పోలీసులు
యాదగిరిగుట్ట రూరల్, నవంబర్ 30 : వాహనంపై ట్రాఫిక్ చలానా పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి.? రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి. కానీ, వీళ్లు మాత్రం మహా ముదుర్లు. ఏకంగా నంబర్ ప్లేట్లనే మార్చేస్తున్నారు. సీరియల్ నంబర్లోని అంకెలను ఎగురగొడుతున్నారు. పోలీస్ కెమెరాలకు చిక్కకుండా ప్లేట్లను బెండ్ చేస్తున్నారు. అడ్డగోలుగా రేడియం స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇలా ట్యాంపరింగ్కు పాల్పడుతున్న వారిపై యాదాద్రి జిల్లా పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఏడాదిఇప్పటివరకు 7,585 కేసులు నమోదు చేశారు.
రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై యాదాద్రి భువనగిరి ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. హెల్మెట్ లేని వాహనాలు, ట్రిఫుల్ రైడింగ్, రాంగ్ రూట్ వెళ్లే వాహనాల ఫొటో తీసి ఆన్లైన్లో జరిమానా విధిస్తున్నారు. అయితే జరిమానా నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
అనేక రకాల జిమ్మిక్కులు..
నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలను పోలీసులు తీసి ఆన్లైన్లో బండి యజమానికి ఈ- చలానా పంపిస్తున్నారు. నంబర్ ప్లేట్ చూడడానికి స్పష్టంగా ఉన్నప్పుడే కెమెరాకు చిక్కితే దాని ఆధారంగా చలానా పంపిస్తారు. అయితే జరిమానాల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్ కెమెరాలకు చిక్కకూడదనే ఉద్దేశంతో కొందరు వాహనదారులు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. కొందరు నంబర్ప్లేట్కు స్టిక్కర్లు అంటించడం, వంచడం, ఒకటో, రెండో అక్షరాలు కనిపించకుండా చెరిపి వేసి జరిమానాలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎక్కువగా ద్విచక్రవాహనాలే ఉంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
ఏకంగా నంబర్ ప్లేట్నే మార్చడం….
ఇంకా కొందరు వాహనదారులు బైక్ నంబర్ ప్లేట్ను కారుకు, కారు నంబర్ ప్లేట్ బైక్కు మార్చి తిరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు యాదాద్రి భువనగిరి జోన్లో జరిగాయి. భువనగిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఒకటి, యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క కేసు నమోదు కాగా, వీరిని లా అండ్ అర్డర్ పీఎస్కు అప్పగించారు. వారి పై క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.
7,585 కేసులు
నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్కు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జోన్లో ఉన్న మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 7,583 కేసులు నమోదు చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
వాహనదారులు నంబర్ ప్లేట్ కనిపించకుండా స్టిక్కర్లు అం టించడం, అంకెలను తీసివేయడం, మాస్కులు వేయడం లాంటి అనేక పనులు చేస్తూ జరిమానాలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. వాహనదారులు నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలి.
-శంకర్, ట్రాఫిక్ ఏసీపీ,యాదాద్రి భువనగిరి జోన్