విజయవంతంగా ముగిసిన సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం
పర్యాటకుల ఆనందోత్సాహాలు
నందికొండ, నవంబర్ 30;అలల సవ్వడులు.. కొండల అంద చందాలు.. పచ్చిక బయళ్ల కనువిందు.. పెట్టని గోడల రాతి వరుసలు.. తీరం వెంబడి జీవరాశులు.. సెల్ఫీల పదనిసలు.. ఇలా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం పర్యాటకులకు కొత్త అనుభూతినిచ్చింది. సోమవారం ఉదయం నందికొండ నుంచి బయల్దేరిన లాంచీ తిరిగి మంగళవారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నది. ఈ ఏడాది తొలి ట్రిప్పు విజయవంతంగా ముగియగా వెళ్లిన పర్యాటకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పర్యాటకశాఖ చేపట్టిన నాగార్జునసాగర్- శ్రీశైలం లాంచీ ప్రయాణం తొలి ట్రిప్పు విజయవంతంగా ముగిసింది. సోమవారం ఉదయం నందికొండ నుంచి బయల్దేరిన లాంచీ తిరిగి మంగళవారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నది. చాకలిగట్టు సమీపంలో జింకలు దుప్పులు నదికి ఇరువైపులా నల్లమల కొండలు, వాటిపై చారిత్ర ఆనవాళ్లు, మరిపించే జలపాతాల అందాలు.. వెరసి అలలపై ప్రయాణం మధురానుభూతులు మిగిల్చిందని పర్యాటకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
నందికొండ హిల్కాలనీ లాంచీస్టేషన్ నుంచి శ్రీశైలానికి పర్యాటకులతో సోమవారం ప్రారంభమైన లాంచీ సాయంత్రానికి లింగాలగట్టు చేరుకున్నది. భక్తులు మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి ఉదయం అక్కడి నుంచి బయల్దేరిన లాంచీ సాయంత్రం 5 గంటలకు నందికొండకు చేరుకున్నది. ప్రతి శనివారం లాంచీ ట్రిప్పు ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. కృష్ణమ్మ అలల సవ్వడులతో సాగిన లాంచీ ప్రయాణంలో నదీ తీరం వెంట అమ్రాబాద్ నల్లమల అడవుల ప్రకృతి సహజ అందాలు, తీరం వెంట మత్స్యకారుల జీవనశైలి, చాకలిగట్టు, నదీతీరంలో దాహం తీర్చుకోవడానికి వచ్చే జింకలు, దుప్పులు కనువిందు చేశాయని పర్యాటకులు తెలిపారు. గౌతమ బుద్ధుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంలో ప్రయాణం, ఏలేశ్వర గట్టు దర్శనం, చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు మధురానుభూతులను మిగిల్చాయని ఆనందం వ్యక్తం చేశారు.
లాంచీ ప్రయాణం సూపర్..
బస్సు కంటే లాంచీలో ప్రయాణం చాలా బాగుంది. కృష్ణానదిలో ఆరు గంటల పాటు కొనసాగిన ప్రయాణంలో ప్రకృతి అందాలతో నేను, మా కుటుంబ సభ్యులందరం చాలా ఎంజాయ్ చేశాం. శ్రీశైలం వెళ్లే వాళ్లు తప్పకుండా లాంచీ ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లాంచీలో సౌకర్యాలు, భోజనం చాలా బాగుంది.