నీలగిరి, రామన్నపేట, నవంబర్ 30 : వైద్య, ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ అధికారుల సమష్టి కృషి, ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఏటా సగటున వెయ్యి కేసులు నమోదవుతుండగా ఈ ఏడాది ఇప్పటివరకు 467 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 21,572 మంది రోగులు ఉన్నారు. వీరిలో 2,835 మందికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందిస్తున్నది. డిసెంబర్1ని ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 సంవత్సరంలో ప్రకటించింది.
బాధితుల సంరక్షణ ఇలా…
జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 15, ఎఫ్ఐఐసీటీసీలు 72, పీపీపీలు 11, ఒక మొబైల్ ఐసీటీసీ సెంటర్లతోపాటు మొత్తం 104 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. బాధితులకు నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని ఏఆర్టీ సెంటర్లో సేవలు అందిస్తున్నారు. సీడీ4 పరీక్షలు, కౌన్సెలింగ్తో పాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు. మరోవైపు నల్లగొండ యూత్పాజిటివ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పిస్తున్నారు. హెచ్ఐవీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పింఛన్, బస్పాస్, పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ప్రస్తుతం 2,835 మందికి పింఛన్, 15,721 మందికి బస్పాస్ సౌకర్యం కల్పిస్తున్నది.
ప్రజల్లో అవగాహన కలిగించడం వల్ల ఎయిడ్స్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. యువత సురక్షిత శృంగార పద్ధతులు పాటించాలి. సురక్షితమైన రక్తాన్ని ఎక్కించుకోవాలి. పాజిటివ్ వ్యక్తులు ఏఆర్టీ సెంటర్లలో అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడడం ద్వారా తమ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. బోగస్ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు.