నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్పల్లి, నవంబర్ 30 : టీఆర్ఎస్ పార్టీ రైతు ప్రభుత్వమని, రైతుల శ్రేయస్సు కోరే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని రైతాంగానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారని, గతంలో ఏ ప్రభుత్వమూ తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. రైతులను తికమక చేసే ప్రకటనలను బీజేపీ నాయకులు మానుకోవాలని సూచించారు. తప్పుడు రిపోర్టులతో బీజేపీ రైతులకు అన్యాయం చేస్తుందని, బీజేపీ పాలనలో దేశం మరింత బీదరికంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఢిల్లీకి వెళ్లి వానకాలం ఎంత ధాన్యం కొంటారో ఆర్డర్ కాపీ తీసుకురావాలన్నారు. దొంగ నిరసనలు, దీక్షలు చేసే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోవట్లేదు అని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చీకటి ఒప్పందాలతో ఆ పార్టీ భ్రష్టు పట్టిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మిల్లర్ల యాజమాన్యాలతో రైతులను సమన్వయం చేస్తున్నామని, మన దగ్గర పండిన ధాన్యాన్నే కొనుగోలు చేయాలని మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరైతూ అధైర్యపడవద్దని, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.