11, 12 తేదీల్లో జాతీయ సదస్సు
ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రను వెలుగులోకి తెస్తాం
వాయిస్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ పాండురంగారావు
బొడ్రాయిబజార్, నవంబర్ 30 : వేములపల్లి మండలం ఆమనగల్లును రాష్ట్రకూటులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని వాయిస్ ఆఫ్ తెలంగాణ సంస్థ చైర్మన్ కెప్టెన్ లింగాల పాండురంగాచారి అన్నారు. ఆనాడు ఆమనగల్లు ఒక ప్రాధాన్యత కలిగిన రాజధాని మాత్రమే కాకుండా వాణిజ్య, వ్యాపార, వర్తక కేంద్రంగా ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకతీయ కాలం నాటి స్వంతంత్ర సంస్థానాధీశుల చరిత్ర ప్రధానంగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో ఆమనగల్లులో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఘన చరిత్రను వెలుగులోకి తీసుకురావడం కోసమే అన్నారు. చారిత్రక కోణం నుంచి పరిశీలిస్తే ఇక్షాకుల కాలం నుంచి నేటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో శిలాశాసనలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కొన్ని శాసనాలు వెలుగులోకి వచ్చినప్పటికీ మరెన్నో బయటకు రావాల్సిన అవసరముందన్నారు. ఈ సదస్సును ఆమనగల్లులో నిర్వహించడానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. కాకతీయుల తర్వాతి కాలంలో ఆమనగల్లును రేచర్ల రెడ్డి రాజులు స్థావరంగా చేసుకొని పాలించినల్లు ఆధారాలు లభించాయన్నారు. వారి కాలంలో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉన్నట్లు, పిల్లలమర్రి తదితర ప్రాంతాల్లో ఈ అంశాన్ని నిరూపిస్తున్నట్లు శిలాశాసనాలు లభ్యమయ్యాయన్నారు. ఈ అంశాలపై చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్ర ఔత్సాహికులు, యూనివర్సిటీ ఆచార్యులు తమ పరిశోధన పత్రాలను ఈ సదస్సులో సమర్పిస్తారని తెలిపారు. ఆమనగల్లుకు చెందిన గడ్డం విష్ణుస్వరూప్రెడ్డి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్రెడ్డి, ఐపీఎస్ శివధర్రెడ్డి, చరిత్ర ఆచార్యులు ప్రొఫెసర్ భాంగ్యా భూక్యా, రాష్ట్ర చారిత్రక పత్రాల భాండాగారం సంచాలకులు పర్వీనా జరీనా, ఓయూ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ హాజరవుతున్నట్లు తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ జి.వెంకటరామిరెడ్డి, టి.వివేక్, చొక్కారావు, ఆమనగల్లు సర్పంచ్ ప్రవీణ్, కందిబండ శ్రీనివాస్, అబ్దుల్ రహీం పాల్గొన్నారు.