నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
పీఓ, ఏపీఓ, అభ్యర్థులతో వేర్వేరుగా సమావేశం
నల్లగొండ, నవంబర్ 30 : డిసెంబర్ 10న నిర్వహించే స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. నల్లగొండ కలెక్టరేట్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైండింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కేంద్రాల్లో ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఒక రోజు ముందుగానే సంబంధిత జిల్లా అధికారులకు రిపోర్టు చేయాలని, అదే రోజు పోలింగ్ సామగ్రిని స్వీకరించి నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 10న ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ సంబంధిత స్థానిక సంస్థల గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. సాధారణ ఎన్నికల వలే కాకుండా ఈ సారి ఓటర్లు ప్రిపరెన్స్ విధానం ద్వారా ఓటు వేస్తారన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, ఎన్నిక పత్రాలను తీసుకొని రూట్ అధికారులతో కలిసి నల్లగొండలోని టీటీడీసీలో ఉన్న మహిళా సమాఖ్య భవనంలోకి రావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, బాలు, డీటీ విజయ్కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలి
స్దానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనకు పాటించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థ్దులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ వివరించి ఎన్నికకు సహకరించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు ర్యాలీలు చేయవద్దన్నారు. పోలింగ్ రోజు అభ్యర్థి తిరిగేందుకు రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని దీనికి రిటర్నింగ్ అధికారికి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారం పోలింగ్ ముగిసేందుకు 72 గంటల ముందు ముగుస్తుందని చెప్పారు. ఎన్నికలు, పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాలని కౌంటింగ్ ఏజెంట్ వివరాలు డిసెంబర్ 4లోపు చెప్పాలని వారు ఓటరుగా ఉండాలని అన్నారు. 9న ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నందున అభ్యర్థులు వారి ప్రతినిధులు హాజరు కావచ్చని తెలిపారు. 10న పోలింగ్ ముగిసిన తర్వాత నల్లగొండకు బాక్స్లు తరిలిస్తామని అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో బాక్సులు భద్ర పరుస్తామని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థులు కాసం వెంకటేశ్వర్లు, కొర్రా రాంసింగ్, బెజ్జం సైదులు, ఏర్పుల శ్రీశైలం, కుడుదుల నగేశ్, వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.