ఇబ్రహీంపట్నం రూరల్, ఏప్రిల్ 20 : కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి కృషితో రసాయన మందును పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ..మండలంలోని గ్రామాల్లో ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఉప్పరిగూడ సర్పంచ్ సొంత ఖర్చులతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయించి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం అబినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
మంచాల ఏప్రిల్ 20 : కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకటేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనాపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నందున ఎవరు కూడా బయట తిరుగొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు సురేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
టీకా వేయించుకోవాలి
కరోనా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని డాక్టర్ అరుణతార అన్నారు. మంగళవారం మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు.