నల్లగొండ, మార్చి 17 : నల్లగొండ-వరంగల్-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల ఓట్ల లెక్కింపును ఎన్నికల యంత్రాంగం పకడ్బందీగా నిర్వహిస్తున్నది. బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 25 బ్యాలెట్ చొప్పున కట్టలు కట్టిన సిబ్బంది సాయంత్రం ఐదున్నరకు కట్టిన కట్టలు తీసి చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లుగా లెక్కించి అనంతరం చెల్లిన ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కించారు.
మొత్తం 15,453 కట్టలు..
ఓట్ల లెక్కింపునకు ముందుగా ఎనిమిది గంటలపాటు బండిల్స్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాగా ఎన్నికల యంత్రాంగం సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి చేసింది. మొత్తం 3,86,320 ఓట్లు పోలవ్వగా వీటిని లెక్కించేందుకు ఎనిమిది హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ వేసి ప్రతి టేబుల్కు 13 బాక్సుల చొప్పున కేటాయించారు. ఆయా బాక్సుల్లో ఉన్న బ్యాలెట్ పేపర్లను టేబుల్పై కుప్పగా పోసి 25 బ్యాలెట్లు ఒక కట్ట చొప్పున కట్టి ఆ కట్టలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరకు చేర్చారు. ఆయా టేబుళ్లలో కౌంటింగ్ మొదటి షిఫ్ట్ సిబ్బంది ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పత్రాలను తీసి కట్టలు కట్టారు. 25 బ్యాలెట్లు ఒక కట్ట చొప్పున మొత్తం 53 టేబుళ్లలో 276కట్టల(ఒక్కో టేబుల్కు) చొప్పున మూడు టేబుళ్లలో 275కట్టల(ఒక్కో టేబుల్కు) చొప్పున 15,453 కట్టలు కట్టి ఆర్వోల దగ్గరకు చేర్చారు.
బండిల్స్ ప్రక్రియను పరిశీలించిన అభ్యర్థులు..
బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టే ప్రక్రియను అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి వచ్చి ఆయా హాల్స్లో పర్యటించి పరిశీలించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సభావత్ రాములునాయక్, వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, రాణీ రుద్రమరెడ్డి, హరీశ్శంకర్గౌడ్, షబ్బీర్అలీతోపాటు పలువురు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి ఉదయమే చేరుకొని ప్రక్రియను పరిశీలించారు.
5:30 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్..
ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టిన ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియను తిరిగి ఐదున్నర గంటలకు ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రంలో మొత్తం ఎనిమిది హాల్స్ ఏర్పాటు చేసిన అధికారులు ప్రతి హాల్లో ఏడు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఓట్ల లెక్కింపు సందర్భంగా 25ఓట్లతో కూడిన 40కట్టలను ప్రతి రౌండ్లో వెయ్యి బ్యాలెట్ పేపర్లు అందించారు. ఇలా 56 టేబుళ్లకు ప్రతి రౌండ్కు 56వేల బ్యాలెట్ పేపర్లు ఇవ్వగా వాటిల్లో చెల్లే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లు వేరుచేసిన అధికారులు ఆ తర్వాత చెల్లుబాటు ఓట్లు ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి అని ఏజెంట్లకు చూపించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లైవుడ్ బాక్సులో పెట్టి తర్వాత కౌంట్ చేశారు.
పోలీసుల పహారా..
కౌంటింగ్ సందర్భంగా భారీ నిఘా ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ అమలు చేసిన పోలీస్ యంత్రాంగం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. కౌంటింగ్ హాల్కు వెళ్లాలంటే పాస్ ఉంటేనే అనుమతి ఇచ్చారు. మీడియా ప్రతినిధులను మినహాయిస్తే కౌంటింగ్ ఏజెంట్లతోపాటు కౌంటింగ్ సిబ్బంది, ఇతర అధికారులను మొబైల్స్తో పాటు పెన్నులు కూడా అనుమతి ఇవ్వలేదు. భద్రత విషయంలో ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 12మంది సీఐలు, 25మంది ఎస్ఐలు, 120మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 320మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు మొత్తం 476మంది విధుల్లో పాల్గొన్నారు.