భూ సమస్యల పరిష్కారానికగ్రీవెన్స్ మాడ్యూల్
ధరణితో భూరికార్డులకు సంపూర్ణ భద్రత
జిల్లాలో సేవలు వినియోగించుకున్న 28,241 మంది రైతులు
జిల్లాలో 10,298 మ్యుటేషన్లు పూర్తి
అర్జీల పరిష్కారంలో సిద్దిపేట నంబర్వన్
ధరణిపై మీసేవ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలి
సమీక్షలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
ములుగు, ఏప్రిల్ 20 : భూరికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ధరణి సేవలు దేశానికే ఆదర్శమని, రాబోయే 3 నెలల్లో రైతులకు మరింత మెరుగైన ఫలితాలు అందనున్నాయని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు. ములుగులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వర్గల్ మండలంలోని పెండింగ్ భూ సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ధరణి ఉద్దేశం, లక్ష్యాలు, రైతులకు కలిగే ప్రయోజనాలను ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలో ఇప్పటి వరకు మ్యుటేషన్లు సేల్స్, ఆధార్ సీడింగ్, డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్తో పాటు వివిధ అంశాలకు సంబంధించి అన్ని కలిపి ఇప్పటివరకు 241 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రాపర్టీ సేల్ 12,029, గిఫ్ట్ డీడీలు 2,975, పెండింగ్ మ్యుటేషన్లు 10,298, ఆధార్ సీడింగ్ 2,043, ఎన్ఆర్ఐలు 7, గ్రీవెన్స్ మాడ్యూల్లో 3,346 మంది అర్జీలు పెట్టుకున్నారని తెలిపారు. మిషన్ మోడ్లో క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ధరణి ద్వారా జిల్లాలో 10,298 మ్యుటేషన్లను పూర్తిచేయగా ఒక్క వర్గల్ మండలంలో 1,003 రిజిస్ట్రేషన్లు, 382 మ్యుటేషన్ల సమస్యలను పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు తీసుకువచ్చిన గ్రీవెన్స్ మాడ్యూల్తో భూ సమస్యలు శరవేగంగా పరిష్కారమవుతున్నాయన్నారు. భూసమస్యల పరిష్కారానికి రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, నేరుగా కలెక్టర్ కంప్యూటర్కు సంబంధిత అర్జీ చేరుతుందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల ద్వారా కేవలం 48 గంటల్లోనే సమస్యను పరిష్కారిస్తున్నామని వివరించారు. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ తప్పిందన్నారు.
గ్రీవెన్స్ మాడ్యూల్లో అన్ని భూసమస్యలకు పరిష్కారం
గ్రీవెన్స్ మాడ్యూల్లో అన్ని భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రైతులు మీసేవా కేంద్రాలకు వెళ్ళి తమ సమస్యలను నమోదు చేసుకుంటే వాటిని తాను స్వయంగా తహసీల్దార్లు, ఆర్డీవోలకు పంపి వారి నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిష్కరిస్తామని తెలిపారు. రైతులను మీ సేవా కేంద్రాలకు వెళ్లి ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు గ్రీవెన్స్ మాడ్యూల్లో 3,642 ధరఖాస్తు రాగా, 2,196 అర్జీలకు స్థానిక తహసీల్దార్, ఆర్డీవోల నుంచి రిపోర్ట్ వచ్చిందన్నారు.
ధరణి సేవలు విప్లవాత్మకం
ఉమ్మడి రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనకు అనేక మార్గాల్లో ప్రయత్నం చేసినప్పటికీ సఫలీకృతం కాలేదని కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో భూరికార్డుల ప్రక్షాళన సాధ్యమైందన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి, తహసీల్దార్ వాణి, వర్గల్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్, రైతు బంధు సమితి అధ్యక్షులు, సేవా ఆపరేటర్లు పాల్గొన్నారు.
ములుగు, ఏప్రిల్ 20 : గజ్వేల్ మండంలో రూర్బన్ పథకం కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ములుగులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రూర్బన్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం పైలెట్ ప్రాజెక్టుగా గజ్వేల్ మండలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి శ్రీ గోపాల్రావు, సీపీడీవో, విద్యుత్శాఖ అధికారులు పాల్గొన్నారు.