బస్సు జెర్నీపై ప్రయాణికులకు ఆసక్తి కలిగేలా ఆర్టీసీ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మీ భద్రతే.. మా బాధ్యత అనే నినాదాన్ని తీసుకొచ్చింది. బస్సు ఎక్కారా.. టిక్కెట్ తీసుకున్నారా.. అనే ధోరణికి స్వస్తి పలికింది. క్షేమంగా ప్రయాణికులు గమ్యాలకు చేరుకోవాలని కోరుతూ ప్రతి బస్సులోని కండక్టర్, డ్రైవర్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రతి ప్రయాణికుడు దేవుడితో సమానమని.. బస్సు ప్రయాణాన్ని ఎంచుకున్న వారికి సంస్థ తరఫున అధికారులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
మహబూబ్నగర్, జనవరి 16 : ప్రయాణం సురక్షితం సుఖమయంగా ఉండాలని ప్రతి ప్రయాణికుడు కోరుకుంటాడు. ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అవగతం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ‘మీ కోసమే మేము’ అనే నినాదంతో ప్రయాణికుడి ముంగిట నిలబడుతున్నది ఆర్టీసీ. బస్సు ఎక్కారా..? టిక్కెట్ తీసుకున్నామా..బస్సు దిగిపోయారా..? ఇక తమకు ఎలాంటి సంబంధం లేదు అనే ధోరణికి చరమగీతం పాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణికుడికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందనే సంకేతాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ‘క్షేమంగా గమ్యానికి చేరుకోండి’అంటూ ప్రతి కండక్టర్, డ్రైవర్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. బస్సు ప్రయాణం చేసే ముందు ఉద్యోగులు ప్రతిజ్ఞను చదివి నిపిస్తున్నారు.
ఆర్టీసీ ప్రతిజ్ఞ
‘అందరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కండక్టర్ విన్నపం.. టీఎస్ఆర్టీసీ స్వాగతం సుస్వాగతం.. మీ ప్రయాణం ఆర్టీసీ బస్సును ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు..’ అంటూప్రతిజ్ఞ చేసి బస్సును ప్రారంభిస్తున్నారు.
ప్రయాణికుడే భగవంతుడు
ప్రయాణికుడు ఆర్టీసీకి దేవుడు. ఆర్టీసీ నడుస్తున్నది కేవలం ప్రయాణికుల ద్వారానే. ఆర్టీసీ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ప్రజలను సురక్షితంగా గమ్యం చేర్చేందుకే పని చేస్తున్నది.. ప్రతి బస్సులోనూ కండక్టర్, డ్రైవర్ బస్సు కదులుతున్న సమయంలో ప్రతిజ్ఞ చేయాలి. ప్రయాణికుల కోసమే ఆర్టీసీ ఉన్నదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రతిజ్ఞ ఉద్దేశం.