‘ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సిద్ధించింది. మార్చి 28న స్వయంభువుల పునఃదర్శనానికి చేపట్టనున్న మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి నారసింహుడి దివ్యక్షేత్రం సిద్ధమైంది’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. మార్చి 21 నుంచి సాగనున్న మహా క్రతువును నిత్యం లక్ష మంది వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదానం సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానాలయం 99 శాతం పూర్తికాగా, ముఖ మండపంలోని స్వర్ణ తొడుగుల పనులు ఈ నెలాఖరుకు పరిపూర్ణమవుతాయని వెల్లడించారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆలయం,కొండ మీద, కింది ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వైటీడీఏ, ఆర్అండ్బీ, ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
యాదాద్రి, జనవరి 21 యాదాద్రి, జనవరి21 : మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయం సిద్ధమైందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి ప్రధానాలయం దాదాపుగా 99 శాతం పూర్తి కాగా ముఖ మండపంలోని స్వర్ణ వర్ణపు తొడుగుల పనులు ఈనెలాఖరులోగా పూర్తి కానున్నాయని చెప్పారు. రాజగోపురాల కలశస్థాపన చేపట్టేందుకు కావాల్సిన పరంజా పనులు చకచకా సాగుతున్నాయని తెలిపారు.
మూడేండ్లలో పూర్తి చేయడం గొప్ప విషయం..
ఈ సందర్భంగా మంత్రి కొండపైన హరిత హోటల్లో వైటీడీఏ, ఆర్అండ్బీ, కాంట్రాక్టర్లు, ఆలయ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుఠిత దీక్షతో స్వామివారి పునర్నిర్మాణం కేవలంలో మూడేండ్లలోనే పూర్తి కావడం గొప్ప విషయమన్నారు. శ్రీ త్రిదండి చినజీయర్స్వామి ఆధ్వర్యంలో విద్వత్ సభ, సిద్ధాంతుల సభ నిర్ణయించిన మహూర్తం ప్రకారం మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమయాల్లో రోజూ లక్ష మంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేసి భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. మార్చి 21న అంకురార్పణతో ఎనిమిది రోజులపాటు మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అష్ణాదశ పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు దివ్య ప్రబంధాల పారాయణం చేయనున్నారని తెలిపారు. మహా సుదర్శన హోమం నిర్వహణకు ఐదారువేల మంది రుత్వికులు పాల్గొంటారని అన్నారు. యాగానికి కావాల్సిన దేశీయ ఆవు నెయ్యి, సమిధులు వంటి వివిధ రకాల యాగ సామగ్రిని అందజేసే టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, గండి చెరువు సుందరీకరణ, నిత్యన్నదాన భవనం, సత్యనారాయణ వ్రత మండపం, బస్ బే త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వర్షం కారణంగా వేగేష్నా ఫౌండేషన్ చేపట్టిన నిత్యాన్నదాన సత్ర భవనం పనుల్లో జాప్యం జరిగిందని గుర్తుచేశారు. ఆలయ పునఃప్రారంభం అనంతరం యాదాద్రి అభివృద్ధి పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కొండపైకి వెళ్లే ఫ్లై ఓవర్ను లండన్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మార్చి 15లోగా ధ్వజస్థంభం,బలిపీఠాలకు స్వర్ణ తాపడం పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. కల్యాణ కట్టలో 48 మంది స్థానిక క్షౌర వృత్తిదారులకు మాత్రమే అనుమతినివ్వాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే మంజూరు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్కు మంత్రి ఆదేశించారు. కొండపైనే షాపింగ్ నిర్మించి మంజూరు చేయాలని శ్రీలక్ష్మీనరసింహస్వామి వర్తక వెల్ఫేర్ సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభు త్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిని కోరగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విమాన గోపురం స్వర్ణ తాపడానికి సుంకిశాలకు చెందిన మల్లారెడ్డి ఇచ్చిన రూ. 50 లక్షల చెక్కును మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆలయ ఈవో ఎన్. గీతకు అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ ఈఓ ఎన్. గీత, ఈఎన్సీ రవీందర్రావు, వైటీడీఏ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, ఆర్అండ్ ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, శంకరయ్య, ఆలయ ఈఈ రామారావు, మహిపాల్రెడ్డి, ఏఈఈ సునీల్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, వైస్ చైర్మన్ కాటంరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలయ అధికారులు గట్టు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు పాల్గొన్నారు.
పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అర్చకబృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి బాలాలయంలో సువర్ణ పుష్పార్చనలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. బాలాలయ ముఖ మండపంలో మంత్రి, ప్రభుత్వ విప్కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈఓ ఎన్. గీత స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న యాదాద్రి నూతనాలయాన్ని పరిశీలించారు. ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, శివాలయం, విష్ణు పుష్కరిణి, క్యూలైన్లు, ప్రధానాలయంలో కొనసాగుతున్న రాజగోపురాలకు పరంజా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కొండ కింద గండి చెరువు, కల్యాణ కట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్ టెర్మినల్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లై ఓవర్ పనులను ఎంతవరకు పూర్తయ్యాయో తెలుసుకున్నారు.