భువనగిరి కలెక్టరేట్, మే 9 : ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహించొద్దని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి సమస్యా పరిష్కారమయ్యేలా చర్యలు వేగవంతం చేయాలని అన్నారు.
ప్రజలు, అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాలని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజావాణిలో 42ఫిర్యాదులు అందాయని, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 32, జిల్లా పంచాయతీ కార్యాలయం, భువనగిరి మున్సిపాలిటీ, ధరణి విభాగాలకు సంబంధించి రెండు చొప్పున, డీఈఓ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, యాదాద్రి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయాలకు చెందినవి ఒక్కొక్క ఫిర్యాదులు అందాయని తెలిపారు.
ఈ సందర్భంగా కరోనా కాలంలో బడికి దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని విద్యా ఉద్యమ కమిటీ సభ్యులు కలెక్టర్కు వినతిప్రతం అందించారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అనాజిపురం పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో ఖోఖో, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ శిక్షణ శిబిరాలు ఈ నెల 31వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 10 పాఠశాలలు, అర్బన్ ప్రాంతంలో 5 పాఠశాలల్లో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
8-14 ఏండ్లలోపు బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజయనేయులు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎదునూరి ప్రేమలతామల్లేశం తన వేతనం రూ.50 వేలతో 30 బెంచీలను పాఠశాలకు బహూకరించగా కలెక్టర్ ఆమెను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, జిల్లా విద్యాధికారి నర్సింహ, అనాజిపురం ఎంపీటీసీ గునుగుంట్ల కల్పనాశ్రీనివాస్, ఉప సర్పంచ్ మైలారం వెంకటేశ్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ విజయసాగర్, నాతి కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయుడు వీళ్ల దశరథరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.