ఆరు నెలల్లో రూ.3లక్షలకుపైగా సంపాదన గ్యార నర్సింహ ఇన్నాళ్లు చిన్నాచితకా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య గ్యార ఆండాలు పేరున దళిత బంధు పథకం కింద ట్రాక్టర్ డోజరుమంజూరయ్యాక వీరి కుటుంబం దశ తిరిగింది.
ఐటీఐ చదివిన వీరి కొడుకు భాస్కర్ వాసాలమర్రిలోనే వరికోత మిషన్పై డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దళిత బంధు పథకంలో వచ్చిన పది లక్షలకు, లక్షా నలభై వేలు జమ చేసి ట్రాక్టర్ డోజర్ కొనుక్కున్నాడు. దీంతో భాస్కర్ ఒకరి కింద డ్రైవర్గా పనిచేసే అవసరం పోయి సొంత బండిపైనే పనిచేసుకునే అవకాశం కల్గింది. నిత్యం 7-8 గంటల పని దొరుకుతున్నది. ప్రభుత్వ సంబంధిత పనులను సైతం అధికారులు వీరికే అప్పగిస్తున్నారు. డీజిల్ ఇతర ఖర్చులు పోను నెలకు రూ.50వేల వరకు మిగులుతున్నాయి.
ఆరు నెలల్లో మూడు లక్షలకు పైగానే సంపాదించినట్లు గ్యార నర్సింహ సంతోషంతో చెబుతున్నాడు. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిన దళితుల జీవన చిత్రాన్ని దళిత బంధు పథకం మార్చి వేస్తున్నది. అరిగోస పడినచోటే ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా తోడ్పాటునందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి అందిస్తున్న రూ.పది లక్షలతో యూనిట్లు ఏర్పాటు చేసుకొని జీవితానికి సరికొత్త బాటలు వేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో 76 కుటుంబాలకు దళిత బంధు పథకం మంజూరు కాగా 89 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు
కూలీలుగా ఉన్న దళితులు ఓనర్లు అయి మెరుగైన జీవితం వైపు దూసుకుపోతున్నారు. మూడు పూటలా తిండికి కష్టమైన తమ జీవితాలు సరికొత్త ఆదాయ మార్గాలతో మలుపు తిరిగాయని దళిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
దళితులకు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం గొప్ప మార్పును కళ్లకు కడుతున్నది. సమాజంలో అట్టడుగు వర్గాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ వారిలో ఆత్మగౌరవాన్ని పెంచుతున్నది. ఈఎంఐ, ష్యూరిటీ అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికీ రూ.10లక్షల చొప్పున అందించడమే ఈ పథకం ఉద్దేశం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమచేస్తున్న అధికారులు అవి పక్కదారి పట్టకుండా యూనిట్ల ఎంపికలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారుల ఆసక్తి మేరకు యూనిట్ల ఎంపికలో సూచనలు, సలహాలు అందిస్తూ క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పిస్తున్నారు.
ఉపాధి, వ్యాపారానికి సంబంధించి ప్రతినెలా లాభనష్టాలను బేరీజు వేస్తూ లబ్ధిదారులకు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలివిడత ఎంపికైన లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. కేవలం రోజుల వ్యవధిలోనే ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయి. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఆకారపు భాస్కర్, మల్లెపాక వెంకన్న, బొంకూరు శ్రీను అనే లబ్ధిదారులు ఉమ్మడిగా హార్వెస్టర్ ఎంపిక చేసుకుని నడుపుతున్నారు. గతంలో నెలకు రూ.5వేలు కూడా ఆదాయం లేని వీరు.. నేడు రోజుకు రూ.7వేల వరకు ఆర్జిస్తున్నారు.
సూర్యాపేట, మే 8 (నమస్తే తెలంగాణ) ఐటీఐ చదివి ఉపాధి కరువైన గ్యార భాస్కర్ ట్రాక్టర్ డోజర్ నడుపుకుంటూ బిజీ అయ్యాడు. నిన్నమొన్నటి వరకు ఎదుగూ బొదుగూలేని జీవితాన్ని గడిపిన బొల్లారం రవి.. పేపర్ ప్లేట్స్, టీ కప్పుల తయారీతో మెరుగైన జీవితానికి బాటలు వేసుకుంటున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోయి భారంగా బతుకీడుస్తున్న తమ కుటుంబానికి కిరాణా షాపు ఆధారమై కొండంత భరోసా నింపిందంటున్నది బుర్రకాయల బాలమణి. నిన్నమొన్నటి వరకు డ్రైవర్గా పనిచేసిన చిన్నూరి బాబు.. సొంత ఆటోకు ఓనరై నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నాడు.
ఇలా.. వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు పథకం ఇక్కడి దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది. వారి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతున్నది. భవిష్యత్తుపై బెంగలేని భరోసాను కల్పించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని దళిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.
– యాదాద్రి భువనగిరి, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ తుర్కపల్లి :
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఉన్న 76 కుటుంబాలకూ దళిత బంధు పథకంలో రూ.10 లక్షల చొప్పున అందరి ఖాతాల్లోనూ జమ అయ్యాయి. అధికారులు సైతం యుద్ధప్రాతిపదికన యూనిట్ల గ్రౌండింగ్ చేశారు. యూనిట్లు ఎంచుకున్న లబ్ధిదారులకు ఆరంభంలోనే క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో దళిత కుటుంబాలు సక్సెస్ ఫుల్గా యూనిట్లను నడుపుకుంటున్నాయి. ఇప్పటి వరకు 89 యూనిట్లకు సంబంధించి కొటేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా.. ఇప్పటికే చాలావరకు యూనిట్లు ప్రారంభమయ్యాయి. మిగతావి ఒకటి రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
నిధుల సద్వినియోగం కోసం గ్రామస్థాయి కమిటీలను, మండల, జిల్లా స్థాయి అధికారులతో రిసోర్స్ టీమ్లను ఏర్పాటుచేసి యూనిట్ల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. గూడ్స్ వెహికిల్స్, డోజర్లు, ప్యాసింజర్ ఆటోలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఆరు నెలల క్రితమే వాహనాలను అందజేయగా.. నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు సంపాదిస్తూ ఆయా కుటుంబాలు ఆత్మగౌరవంతో ఆనందంగా గడుపుతున్నాయి. భవన నిర్మాణ రంగంలో మేస్త్రీలుగా, కూలీలుగా పనిచేసిన కొన్ని కుటుంబాలకు సెంట్రింగ్ మెటీరియల్, పిల్లర్ల బాక్సులు, జాకీలను అందజేయగా వాటితో ఆయా కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.
ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకు సెంట్రింగ్ కూలీగా పనిచేసిన బొల్లారం ఆనంద్ నేడు సేఠ్గా మారి మరో నలుగురికి ఉపాధి చూపుతున్నాడు. మెడికల్ ల్యాబ్తో ఒకరు.. పేపర్ ప్లేట్లు, గ్లాసుల తయారీ యూనిట్తో మరొకరు, వెల్డింగ్ దుకాణంతో ఇంకొకరు స్వయం ఉపాధి పొందుతూ తమ జీవితాలకు కొత్త బాటలు వేసుకున్నారు. కోళ్ల పెంపకానికి ఆసక్తి కనబర్చిన లబ్ధిదారుల షెడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కోడిపిల్లల సరఫరా, కొనుగోళ్ల కోసం స్నేహ కంపెనీతో లబ్ధిదారులు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
మరికొంత మంది తమ వ్యవసాయ భూముల్లో బోర్లు వేసుకున్నారు. కూరగాయలు, ఆకు కూరలను సాగు చేసుకునేందుకు భూములను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందనున్న దళిత కుటుంబాలకు, గొర్ల పెంపకంతో జీవనం సాగించనున్న కుటుంబాలకు సైతం గొర్రెలు, బర్రెలను అందజేయడంతో ఆయా కుటుంబాలు బిజీబిజీగా గడుపుతున్నాయి.
రూ.170 నుంచి 7వేలకు పెరిగిన ఆదాయం
భాస్కర్, వెంకన్న, శ్రీను రోజువారీ కూలీలు. రోజంతా కష్టపడితే నెలకు రూ.5వేలు అంటే రోజుకు 170 రూపాయలు వారి ఆదాయం. దళితబంధు పథకం తొలి విడుతలో తుంగతుర్తి మండల కేంద్రంలో ఎంపికైన 26 మంది లబ్ధిదారుల్లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఒకే ఊరు, చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడంతో ముగ్గురూ కలిసి హార్వెస్టర్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపారు. అధికారుల సలహాలు, సూచనలతో యూనిట్ను ఎంపిక చేసుకున్నారు. ఇదే సమయంలో యాసంగి వరి కోతల సమయం కావడంతో 20రోజులుగా బిజీ అయ్యారు. రోజూ 8 గంటల చొప్పున వరి చేలు కోస్తున్నారు.
కలలో కూడా ఊహించుకోలేదు…
ప్రైవేట్ పాఠశాలలో ఏండ్ల తరబడి అతి తక్కువ జీతానికి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడిని. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కూలీ పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్న మాకు ప్రభుత్వం దళితబంధు పథకం వర్తింపజేయడం మా జీవితాలను మలుపుతిప్పింది. హార్వెస్టర్ ఎంపిక చేసుకోవడం వల్ల రోజుకు వేలల్లో ఆదాయం వస్తున్నది. చాలా కష్టాలు అనుభవించిన మా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. సీఎం కేసీఆర్, ఎమ్మెలే గాదరి కిశోర్కుమార్ దయతో తమ బతుకులు ఇక బాగుపడ్డట్లే.
– బొంకూరి శ్రీనివాస్, తుంగతుర్తి
మెద కట్టిన చోటనే మిషన్తో సేటునయ్యా..
రెక్కాడితే డొక్కాడని మాకు దళిత బంధు పథకం వరంలా మారింది. వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షలు ఇవ్వగా ముగ్గురం కలిసి హార్వెస్టర్ కొన్నాం. వరి పొలాల్లో మెద కట్టేందుకు వెళ్లిన చోటనే నేడు హార్వెస్టర్తో వెళ్లి కోతలు కోయిస్తూ సేటును అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏడాదిలో మూడు నెలల పాటు వెయ్యి గంటలు పని కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుత రాబడి చూస్తే ఏడాదిలోనే ఒక్కొక్కరికి రూ.7లక్షల వరకు వస్తాయని అధికారులు చెప్పారు. మాకు నమ్మకం కలిగింది.
హార్వెస్టర్ కొనుగోలు చేసిన తరువాత ముగ్గురివి కలిపి మరో రూ.3 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని డబ్బులు పెట్టి గొర్రెలు కొనాలనుకుంటున్నాం. అధికారుల సలహాలు, సూచనలతో మరో మంచి వ్యాపారం ప్రారంభించి తీరుతాం. దళితబంధు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు, మమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్కు జీవిత కాలం రుణపడి ఉంటాం.
– ఆకారపు భాస్కర్, తుంగతుర్తి
కూలీ నుంచి ఓనర్ అయ్యా… నేను రోజువారీ కూలి పనికి వెళ్లేది. కటిక
దరిద్రంలో జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ వెలుగులు నింపారు. దళిత బంధు పథకం వల్ల నేను హార్వెస్టర్కు ఓనర్ అయ్యాను. రోజుకు 8 గంటలు.. గంటకు రూ.3500 లెక్కన రోజూ రూ.28వేలు ఆదాయం వస్తున్నది. డీజిల్, డ్రైవర్ జీతం రూ.8వేలు పోను దాదాపు రూ.20 వేలు మిగులుతున్నాయి. బ్యాంకు రుణం లేదు. అప్పు చెయ్యలేదు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షలతో వ్యాపారం ప్రారంభించాం. మా పిల్లలు ఇతరుల సాయం కోసం అర్రులు చాచకుండా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక భరోసా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం.
– మల్లెపాక వెంకన్న, తుంగతుర్తి
ట్రాలీ ఆటోతో కొత్త జీవితం..
ఈయన పేరు చిన్నూరి బాబు. ఇతని తల్లి ఆండాలు పేరున దళిత బంధు యూనిట్ మంజూరైంది. వచ్చిన డబ్బుతో మహీంద్రా ఆటో ట్రాలీ కొనుక్కున్నాడు. వాసాలమర్రి చుట్టూ ఉన్న ఊర్లకు సరుకులను చేరవేస్తూ నెలకు రూ.30వేలకు పైగానే సంపాదిస్తున్నాడు. గతంలో బాబు స్థానికంగా ఓ కూల్డ్రింక్ ఏజెన్సీ వద్ద డ్రైవర్గా పనిచేశాడు. నెలకు రూ.10వేల జీతంతో కుటుంబం అంతంతమాత్రంగానే సాగింది. సొంతంగా ఆటోను నడుపుకొనే రోజులు వస్తాయని ఎన్నడూ అనుకోలేదని బాబు సంతోషంతో చెప్తున్నాడు. అప్పు చేయాల్సిన అవసరం రాకుండా.. అప్పుకట్టాలన్న రందీ కూడా లేకుండా చేసిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని అంటున్నాడు.
కలలో కూడా అనుకోలే..
గతంలో దళితులను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మా కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ దళిత బంధుతో మా జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చిండ్రు. ఒకప్పుడు లారీ డ్రైవర్గా పనిచేసే వాడిని. వచ్చే కొద్దిపాటి జీతం ఏ మూలకూ సరిపోయేది కాదు. గిప్పుడు నా భార్య రేఖ పేరుమీద దళిత బందు పథకం మంజూరైంది. రూ.7.50లక్షలతో పేపర్ టీ కప్పుల యూనిట్ను, మరో రూ.2.50లక్షలతో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసుకున్న. చుట్టుపక్కల ఊర్లలోని షాపులకు అమ్ముకోవడం వల్ల నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు సంపాదిస్తున్న. మా జీవితం ఇంత మంచిగా మారుతదని కలలో కూడా ఊహించలే.
– బొల్లారం రవి
ఇన్నేండ్ల బాధలన్నీ పోయినయ్..
ఇంటికి పెద్ద దిక్కు లేక కుటుంబ భారమంతా నాపైనే పడింది. కూలీనాలి చేసుకుని బతుకుతున్నం. ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లలో ఒక కూతురు పెళ్లి చేసిన. కూలి పనులకు పోయేందుకు చేత కావడం లేదు. ఇంటిపట్టునే ఉండి పనిచేసుకునేందుకు ఏ ఆసరా లేదాయె. దళిత బంధు పుణ్యమా.. అని సీఎం కేసీఆర్ సారు దయతో కిరాణం షాపు పెట్టుకున్న. గిప్పుడు కూలి పనులకు పోయే అవసరం లేక నిమ్మలమైంది. ఇప్పటి వరకు చేసిన కష్టం అంతా బతికేటందుకే సరిపోయేది. గిప్పుడు నాలుగు పైసలు ఎన్కేసుకుంట.
– బుర్రకాయల బాలమణి