భువనగిరి కలెక్టరేట్, మే 5 : దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆత్మకూర్. ఎం, బీబీనగర్, బొల్లేపల్లి, నారాయణపురం, భూదాన్పోచంపల్లి, కొలనుపాక, చౌటుప్పల్, రాజాపేట, చిన్నకందుకూరు, రామన్నపేట, సర్వేల్, రాయిగిరి ఆయూష్ ఆరోగ్య కేంద్రాలు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం పరిధిలోకి వచ్చినందున అలోపతి, ఆయూష్ ఆరోగ్య కేంద్రాలు సమన్వయంతో పనిచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆయూష్ డాక్టర్లు ఓపీ సేవలు, తల్లి బిడ్డల ఆరోగ్య సేవల్లో పాల్గొనాలన్నారు. ఆయూష్ పరిధిలో ఉన్న ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటి వాడకం, తద్వారా కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయూష్ కేంద్రాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని, క్షేత్రస్థాయిలో మరమ్మతు పనులను గుర్తించి మెరుగుపర్చుకోవాలన్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలోని పలు కూడళ్లలో తల్లీబిడ్డల సంరక్షణపై అవగాహన కల్పించేలా హోర్డింగ్లు ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం సభలలో ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సమన్వయంతో సాధారణ ప్రసవాలపై విస్తృతంగా ప్రచారాలు, చర్చలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, జిల్లా ఆయూష్ కన్వీనర్ డాక్టర్ పృథ్వీరాజ్, వైద్యులు డాక్టర్ ప్రశాంత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యశోధ పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతలను భాగస్వామ్యం చేస్తూ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడారు. మన ఊరు-మన బడి కార్యక్రమంద్వారా జిల్లాలోని 251 పాఠశాలల్లో మొదటి విడుత కింద చేపట్టే నిర్మాణ పనులు, వసతులను జిల్లాలోని పారిశ్రామిక వేత్తలకు వివరించి మాట్లాడారు. ఇందుకోసం ప్రభుత్వం జీఓ 4 ద్వారా దాతలను భాగస్వాములను చేయాలని ఆదేశాల ఇచ్చిందని అన్నారు.
ఇందులో భాగంగా రూ, 2లక్షల విరాళంతో స్కూల్ లెవల్ కమిటీలో మెంబర్షిప్, రూ.10 లక్షలతో తరగతి గదులకు దాతల ఇష్టమైన వారి పేరు పెట్టడం, రూ.25లక్షల విరాళంతో ప్రాథమిక పాఠశాలకు,రూ.50లక్షలు అందిస్తే ప్రాథమికోన్న పాఠశాలకు, రూ.కోటి విరాళం అందిస్తే ఉన్నత పాఠశాలలో ఒక బ్లాకుకు వారు సూచించిన పేరును పెట్టుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, జిల్లా విద్యాధికారి నర్సింహ, పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.