యాదగిరిగుట్ట రూరల్, మే 4 : మండలంలోని మల్లాపురంలో పది రో జులపాటు జరుగనున్న ఉత్సవాలతో మల్లాపురంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రధాన రహదారితోపాటు ప్రతి వీధిలో విద్యుద్దీపాలు అలంకరించారు. చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దడంతో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ చెరువుకట్ట వద్ద నిర్మించిన గట్టు మైసమ్మ ఆలయాన్ని ఉత్సవాలకు ముస్తాబు చేశారు.
గ్రామానికి చెందిన పురోహితుడు వెన్నకూచి రామ్మోహన్శర్మ ఆధ్వర్యంలో 15 మంది పురోహితులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూజల కోసం నాలుగు యా గశాలలను ఏర్పాటు చేశారు. దాంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది.
పది రోజుల ఉత్సవాల్లో భాగంగా 8వ తేదీన ప్రధాన ఘట్టం నిర్వహించనున్నారు. బొడ్రాయి పునఃప్రతిష్ఠ, అష్టదిగ్బంధనం చేపట్టనున్నారు. వీటితోపాటు పోచమ్మ, గట్టు మైసమ్మ, పెద్దమ్మ, దేవతాముర్తులకు యంత్రప్రతిష్ఠ చేపడతారు. 5న అగ్ని ప్రతిష్ఠాపన, దేవతామూర్తులకు శోడషోపచారణ పూజలు, 6న మూలమంత్ర హోమాలు, 7న దేవతామూర్తులకు జలాధివాసం, ధాన్యధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం, 9న పెద్దమ్మ పండుగ, 10న అమ్మవారి కల్యాణం, 11న పోచమ్మ కల్యాణం, 12న గట్టు మైసమ్మ పండుగ ప్రారంభం, గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి కట్ట మైసమ్మ వరకు దున్నపోతులతో ర్యాలీ, ఒగ్గు కళాకారుల ర్యాలీలు, 13న మారెమ్మకు బోనాలు, 14న కట్ట మైసమ్మకు పూజలు, దుర్గమ్మ పండుగ, 15న వనభోజనాలతో ఉత్సవాలు ముగియనునట్లు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం మొదటి రోజు మహాగణపతి పూజ, రుత్విక్హరణము, పుణ్యాహవాచనము, మంత్రపుష్పం నిర్వహించారు.
గ్రామ దేవతల విగ్రహాల పునఃప్రతిష్ఠా మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించుకుంటాం. పది రోజులపాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామపంచాయతీ పాలకవర్గం, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులంతా ఉత్సవాల్లో పాల్గొంటారు. గ్రామంలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొన్నది.
– కర్రె వెంకటయ్య, సర్పంచ్, మల్లాపురం