జిల్లాలో వాన దంచికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. విద్యుత్ స్తంభాలతోపాటు చెట్లు నేలకూలాయి. పలుచోట్ల వరిపంట నేలకొరగగా మామిడి కాయలు రాలాయి. పిడుగుపాటుకు గొర్రెలు, పశువులు మృత్యువాత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా అత్యధికంగా యాదగిరిగుట్ట పట్టణంలో 8 మిల్లీమీటర్లు కురిసింది. కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఉడుకెత్తిపోతున్న వాతావరణం వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది.- యాదాద్రి భువనగిరి, మే
యాదాద్రి భువనగిరి, మే 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షం రైతన్నకు శాపంగా మారింది. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట వైకుంఠ పాదం వైపు వెళ్లే రహదారి కుంగిపోయింది.
సంబంధిత అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. యాదాద్రి కొండపైన భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. రాజపేట మండలం జాల గ్రామంలో పిడుగుపాటుకు పాడి గేదె మృతి చెందగా మోత్కూరు మండలం దాచారంలో పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మోత్కూరు, ఆత్మకూరు తదితర మండలాల్లో పలుచోట్ల చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల వరి చేలకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 639.2 ఎంఎం వర్షపాతం నమోదైంది.
చౌటుప్పల్, మే 4 : మున్సిపాలిటీలో మంగళవారం ఉదయం అకస్మాతుగా కురిసిన వర్షానికి రైతులకు కొద్దిపాటి నష్టం వాటిల్లింది. సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు తడిసినాయి. వర్షం తగ్గాక ధాన్యాన్ని అరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
రామన్నపేట : మండలవ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున 57.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రైతుల ధాన్యం తడవడంతో అపార నష్టం వాటిల్లింది. రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యాన్ని పట్టాలపై, సీసీల ప్లాట్ఫాంలపై ఆరబోశారు. కొన్నిచోట్ల ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరిచేను నేలకొరింది. రామన్నపేట మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ పరిశీలించారు.
మోత్కూరు : ఈదురుగాలుల వర్షం పండ్ల తోటల రైతులను నిండా ముంచింది. బుధవారం తెల్లవారుజామున మండలంలోని పలు గ్రామాల్లో మామిడి, నిమ్మ తోటల్లో కాయలు రాలి నేల పాలై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో, పాటిమట్ల, ముశిపట్ల, దాచా రం, అనాజిపురం, సదర్శాపురం గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. గాలి బీభత్సవానికి ఉదయం 9.30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు దాచారం గ్రామానికి చెందిన రైతు బొబ్బలి లింగయ్యకు చెందిన 10 గొర్రెలు మృతి చెందాయి. పాలడుగుకు చెందిన రైతు కొప్పుల సుదర్శన్రెడ్డి గేదె మృతిచెందింది.
అడ్డగూడూరు : మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసింది. వరి చేన్లు ఈదురుగాలులకు నేలకొరిగాయి.
సంస్థాన్ నారాయణపురం : మండలవ్యాప్తంగా బుధవారం ఆర్ధరాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి వరి పంటలు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పోర్లగడ్డ తండాలో విద్యుత్ స్తంభం నెలకొరిగింది. మార్కెట్లో ఎండబెట్టిన వడ్లు తడిసి పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం వేకువజామున ఆకాల వర్షం కురిసింది. గాలిదూమారం, ఈదురు గాలు లతో కూడిన వర్షం రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరింది. మాసాయిపేట కొనుగోలు కేంద్రంలోకి నీరు చేరడంతో బస్తాలు ఓ మోస్తారుగా తడిశాయి. రైతులు టార్ఫాలిన్లు ధాన్యం బస్తాలపై కప్పినారు. జంగంపల్లి, గౌరాయపల్లి, సాధువెల్లి గ్రామా ల్లోనూ వర్షం కురిసింది.
రాజాపేట : మండల వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరి చేను నేల వాల డంతోపాటు అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. జాల గ్రామంలో పిడుగుపాటుకు మెగిలి చంద్ర య్య గేదె మృతిచెంది రూ. 70 వేల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.
ఆత్మకూరు(ఎం) : మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లింగారాజుపల్లిలో విద్యుత్స్తంభాలు, చెట్లు కూలిపోగా పల్లెర్లలో భారీ వృక్షం దారికి అడ్డంగా నేలకొరిగింది. అన్ని గ్రామాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సిబ్బంది కూలిపోయిన స్తంభాలను సరిచేసే పనిలో పడ్డారు. రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను పంచాయతీ సిబ్బందితోపాటు గ్రామస్తుల సహకారంతో తొలగించారు. మండలంలోని కూరెళ్లలో బాషబోయిన మల్ల య్యకు చెందిన రూ. 80 వేల విలువైన పాడిగేదె పిడుగుపాటుతో మృతిచెందింది.
తుర్కపల్లి : మండలకేంద్రంతో పాటు దత్తాయిపల్లి, వాసాలమర్రి, వెంకటపురం తదితర గ్రా మాల్లో బుధవారం వేకువజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తుర్కపల్లి, దత్తాయిపల్లి గ్రామాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. కల్లాలోని ధాన్యం వాన నీటికి కొట్టుకుపోయింది.
భువనగిరి అర్బన్ : మండలంలో బుధవారం ఉదయం మోస్తారు వర్షం కురిసింది. మండలంలోని భువనగిరి-మోత్కూర్ రోడ్డు మార్గంలోని కూనూరు సమీపంలో వర్షానికి చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎంపీటీసీ పాశం శివానంద్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో రోడ్డు మార్గంలోని చెట్లను తొలగించడంతో రాకపోకలు యాథావిధిగా కొనసాగాయి.
యాదాద్రి, మే 4: ఆకాల వర్షంతో యాదగిరిగుట్ట పరిసరాలు జలయమయ్యాయి. బుధవారం తెల్లవారుజామూన కురిసిన అకాల వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కొండపైన వేసిన చలువ పదిళ్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరగగా, ఆలయ అధికారులు పునరుద్ధరిస్తున్నారు. కొండపై నుంచి కిందకు వచ్చే ఎగ్జిట్ ఫ్లై ఓవర్ కుంగింది. దీంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. వర్ష ప్రభావంతో పాడైన ప్రాంతాలను దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు పరిశీలించారు.
నకిరేకల్ మండలం మోదినిగూడెంలో బుధవారం పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన పగడాల లింగరాజు(22) బుధవారం రాత్రి బావి ద గ్గర ఉన్న గొర్ల మంద వద్ద నిద్రించేందుకు వెళ్లాడు. తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తుండడంతో ఇంటికొచ్చేందుకు బయలుదేరాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు రావడంతోపాటు పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వేర్వేరుగా మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగరాజు కుటుంబసభ్యులకు రూ. 50 వేలు అందజేశారు.