చౌటుప్పల్ రూరల్, మే 3 : మండలవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోంది. పంట దిగుబడి అంచనాలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కమిటీ ఆధ్వర్యంలో, మండలంలోని పెద్దకొండూర్, జైకేసారం, నేలపట్ల, ఎస్.లింగోటం, మందోళ్లగూడెం, గుండ్లబావి తదితర గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, దండుమల్కాపురం, చిన్నకొండూరు, మసీదుగూడెం, డి. నాగారం, పంతంగి, అల్లాపురం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కాగా మండలవ్యాప్తంగా రైతులు 9,822 ఎకరాల్లో వరి సాగుచేశారు. తదనుగుణంగా 2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణే లక్ష్యంగా అధికార యంత్రాంగం ముందుకుసాగుతున్నది. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్ణీత సమయంలో కొనుగోళ్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మే రకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించి 10 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు 23వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించాం. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– బొడ్డు శ్రీనివాస్రెడ్డి, చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్
వ్వవసాయ అధికారులు ఇతర పం టలు వేయాలని సూచనలు చేసినా పట్టించుకోలేదు. నీళ్లు పుష్కలంగా ఉండటంతో వరినే సాగు చేశాం. ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చేతులెత్తేసినప్పటికీ సీఎం కేసీఆర్ సారు కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– పల్లె జంగయ్య రైతు, జైకేసారం, చౌటుప్పల్ మండలం