నూలు పోగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తున్నది. చేనేతకు చేయూత, చేనేత మిత్ర పథకాలతో నేతన్నకు అండగా ఉంటూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే.. చేనేత వృత్తిపై ఆధారపడిన కార్మికులకు రైతు బీమా మాదిరిగా రూ.5లక్షల బీమా అందించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్న నేతన్న బీమా పథకానికి రూ.29.98కోట్లను సైతం విడుదల చేసింది. సర్కారు నిర్ణయం చేనేత కార్మిక కుటుంబాల్లో కొండంత భరోసాను నింపుతున్నది. జిల్లాలో చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు 14,400 కుటుంబాలకు బీమా పథకంతో ఆర్థిక భరోసా లభించనున్నది.
యాదాద్రి భువనగిరి, మే 3 : (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు బీమా..మాదిరిగా చేనేత కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయం అందనుంది. ఈ మేరకు సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ బీమా అమలుకోసం రూ.29.98 కోట్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనుండడంతో సంబంధిత శాఖ అధికారులు కార్యాచరణపై దృష్టి సారించారు.
ఏదైనా కారణంతో రైతు చనిపోతే నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కింద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మిక కుటుంబాలకు సైతం ఇదే తరహాలో పరిహారం అందనుంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు చేనేత కార్మికులవే జరిగేవి.
అప్పట్లో ప్రభుత్వం, కార్మికుల భాగస్వామ్యంతో రూ.లక్ష బీమా పథకం అమలయ్యేది. ప్రీమియం చెల్లింపులు సమస్యగా మారడంతో 2013లో దీనిని రద్దు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత చేనేతతో పాటు ఇతర వృత్తుల వారు ఎవరైనా చనిపోతే సీఎం సహాయ నిధి, ఆపద్బంధు ఇతర పథకాల కింద సాయం అందిస్తున్నారు. ఇక నుంచి చేనేత వృత్తులకు సైతం బీమా వర్తిస్తున్నది. ఈ వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాల్లోని ఇంటి పెద్దదిక్కు దూరమైతే సర్కారు సాయం ఆసరాగా నిలువనుంది. చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ కార్మికులకు సైతం బీమా వర్తించనుంది.
‘త్రిఫ్ట్’ పథకంలో 5,300 మగ్గాలను జియో ట్యాగింగ్ చేశారు. ఇందులో 5,230 మంది వీవర్స్, మరో 5,170 మంది అనుబంధ కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే వీరి పేరిట బ్యాంకు ఖాతాలున్నాయి. మరో 1500 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేసి ఉంచారు. ఇంకా పవర్ లూమ్కు సంబంధించి 2,500 మంది ఉండగా…వీరిని కూడా ‘త్రిఫ్ట్’ పథకంలో చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో మొత్తంగా 14,400 మంది ‘నేతన్న బీమా’కు అర్హత పొందనున్నారు. బ్యాంకు ఖాతా సందర్భంగానే నామినీ వివరాలను సేకరించి ఉండడంతో బీమా వర్తింపు ప్రక్రియకు అవరోధాలు సైతం అంతగా ఉండవని అధికారులు చెబుతున్నారు.
చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 40 శాతం సబ్సిడీ ఇచ్చి ‘చేనేత మిత్ర’పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇందులో 35 శాతాన్ని కార్మికులకు చెల్లిస్తుండగా.. మిగతా 5 శాతం సబ్సిడీని సంఘానికి లేకుంటే గ్రూపు లీడర్కు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్హెచ్డీసీ) సంస్థలో గానీ, ఆ సంస్థ పరిధిలో పనిచేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తున్నది.
జనగామ, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు. ఇందులో నమోదైన వారు సిల్క్కు సంబంధించిన నూలు కొనుగోళ్లపై ఏడాదిలో 9 సార్లు, కాటన్పై 12 సార్లు లబ్ధ్ది పొందే అవకాశం ఉంది.
ఈ లెక్కన మగ్గం నేసే నేత నెలకు రూ.4-5వేలను, అనుబంధ కార్మికుడు రూ.1-2వేల వరకు లబ్ధి పొందవచ్చు. 2018 జూన్లో ప్రారంభమైన ఈ పథకంలో జిల్లాలో 3,236 మంది వీవర్స్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సబ్సిడీని దశలవారీగా చెల్లింపులు జరుపుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు 14,797 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చి కార్మికుల ఖాతాల్లో రూ.7.66 కోట్లను జమచేసి 3వేల మంది వీవర్స్కు, మరో 6వేల మంది అనుబంధ కార్మికులకు గొప్ప ఊరటను కలిగిచింది.
మరమగ్గాల నుంచి విపరీతమైన పోటీ.. ముడి సరుకుల ధరలు ఆకాశానికి చేరి.. మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితుల్లో..కరోనా చేనేత బతుకులను మరింత ఛిద్రం చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేనేతలను చేయూత, త్రిఫ్ట్, చేనేత మిత్ర వంటి పథకాలతో ఆదుకుంటున్నది. 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించగా.. ప్రతి నెలా 8 శాతం పొదుపు చేసిన కార్మికుడి ఖాతాలో 16 శాతం వాటా ధనంగా ప్రభుత్వం మూడేండ్ల వ్యవధి ముగిశాక అందజేస్తున్నది.
ఈ పథకంలో కార్మికులు కనిష్ఠంగా రూ.200 నుంచి రూ.1500 వరకు పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. గతేడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘చేనేతకు చేయూత’ పేరుతో జిల్లాలోని 5,400 మంది కార్మికులకు రూ.33 కోట్ల వరకు పొదుపు నగదును అందజేసింది.
అలాగే పేరుకుపోయిన వస్త్ర నిల్వలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. మధ్యలో కొద్దిరోజుల పాటు పథకం నిలిచిపోగా.. గతేడాది సెప్టెంబర్లో ఈ పథకాన్ని ప్రభుత్వం తిరిగి కొనసాగించింది. ఈ ఏడాది జనవరి నాటికి 5,230 వీవర్స్, మరో 5,170 అనుబంధ కార్మికులకు రూ.3.84 కోట్లు అందజేసింది.