ప్రభుత్వ పథకాల్లో ట్రాన్స్జెండర్లకు పూర్తిస్థాయి భాగస్వామ్యం, సమానత్వం కల్పించడంపై కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక దృషి ్టసారించారు. సమాజంలో సగర్వంగా జీవించేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటునూ అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు గుర్తింపు కార్డులను అందజేయగా, రానున్న రోజుల్లో మరింత భరోసా కల్పించే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మెప్మా గ్రూపులుగా ఏర్పాటు చేయడంతోపాటు పెన్షన్ వంటివి కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడుతున్న వారికి ప్రభుత్వం తరపున చేయూత అందించనున్నారు. వరంగల్లో మున్సిపల్ కమిషనర్గా పని చేసినప్పుడు ట్రాన్స్జెండర్ల సంక్షేమ కోసం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంతో అదే స్ఫూర్తితో ఇక్కడా చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, మే2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వివక్షతను రూపుమాపి సమాజంలో అన్నివర్గాలతో సమానంగా గౌరవంగా జీవించేలా జిల్లాలో అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. సరైన ఉపాధి అవకాశాలు లేక అగమ్యగోచరంగా మారిన ట్రాన్స్జెండర్ల జీవితాలకు బంగారు బాటలు వేసే దిశగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
చాలామంది భిక్షాటన చేసి బతుకుతున్నట్లు గుర్తించి వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఇప్పటికే కార్యాచరణను మొదలుపెట్టారు. ఇటీవల జిల్లాలోని ట్రాన్స్జెండర్లతో సమావేశాన్ని నిర్వహించి సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్షతను, ఇబ్బందులను తెలుసుకున్నారు. గతంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్గా ట్రాన్స్జెండర్ల సంక్షేమ కోసం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఇక్కడా అదే తరహాలో పలు కార్యక్రమాలు అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ సంకల్పిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 24 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో చాలామంది యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోనే ఉన్నారు. ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు ఇటీవల ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేశారు. ట్రాన్స్జెండర్లు మున్సిపాలిటీ ప్రాంతాల్లోనే ఉండడంతో వారందిరినీ మెప్మాలో గ్రూపులుగా ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు అందించి జీవనోపాధి కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ కల్పించి యూనిట్స్ మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు. సామూహికంగా యూనిట్లు నిర్వహించుకోవాలనుకునే వారికి కూడా ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
పెన్షన్ కోసం ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. కొంతమందికి ఉన్నప్పటికీ ఆధార్కార్డులో ట్రాన్స్జెండర్గా నమోదు కాలేదు. వీరందరికీ క్యాంపు నిర్వహించి ఆధార్ కార్డులు ఇప్పించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయుష్మాన్భవ, ఈ శ్రమ్ పథకాల్లో నమోదు చేయించి ప్రభుత్వ ఫలాలు పొందేలా చూడనున్నారు. సఖి సెంటర్ల ద్వారా భద్రత, రక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ చొరవ పట్ల ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జిల్లాలో సెక్స్ వర్కర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టినప్పటికీ పూర్తిగా సఫలీకృతం కాకపోవడంతో ఈ సారి వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరంగా భరోసా కల్పించేందుకు జిల్లా కలెక్టర్ నడుం బిగించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 147 కుటుంబాలు, జిల్లాలోని పలు చోట్ల మరో 26 వరకు కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో సెక్స్ వర్కర్ల కుటుంబాలను ఆదుకునేందుకు వితంతు, వృద్ధాప్య పింఛన్లు అందించారు.
ఇంకా 36 మంది పెన్షన్కు అర్హులుగా తేలడంతో వారికి కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెక్స్ వర్కర్ల కుటుంబీకుల్లో ఎవరైనా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివినవారు ఉంటే కోచింగ్, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు పోలీస్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనబరుస్తుండడంతో వారికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యావంతులు లేకుంటే వారికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించి జీవనోపాధి కల్పించే దిశగా ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.