జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తిపన్నును ముందస్తుగానే రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
2022-23 సంవత్సరానికి ఎర్లీబర్డ్ స్కీంలో ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు రాష్ట్ర
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గత ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ అవకాశం
కల్పించగా పట్టణ వాసులు ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగపర్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు నెల రోజుల వ్యవధిలోనే రూ.3.28కోట్ల వరకు ఆస్తిపన్నును రాబట్టుకోగలిగాయి. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజానీకం సైతం తమవంతు తోడ్పాటునందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెల్లింపులు జరిపారు. రాయితీపై అధికారులు విస్తృత ప్రచారంనిర్వహించడం, వార్డుల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోనే ఇది సాధ్యమైందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి 25,731 నిర్మాణాలకు సంబంధించి రూ.9.79కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎర్లీబర్డ్(ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు) పథకంలో 5 శాతం రాయితీని కల్పించింది. ముందస్తుగా చెల్లించేవారికి ఇది వర్తించనుండగా.. పట్టణవాసులు బాధ్యతగా ముందుకువచ్చారు. ప్రభుత్వం ఆశించినట్లుగానే ఆయా మున్సిపాలిటీలు ఆస్తి పన్నును వసూలు చేయగలిగాయి.
భువనగిరి మున్సిపాలిటీలో 8,065 నిర్మాణాలకు సంబంధించి రూ.3.46కోట్ల వరకు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉండగా.. స్పెషల్డ్రైవ్లో రూ.1.05కోట్లను ముందే చెల్లించి పట్టణవాసులు రాయితీని సద్వినియోగపర్చుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 6,032 నిర్మాణాలకు సంబంధించి రూ.3.91కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రూ.1.83కోట్లు ముందస్తుగా చెల్లించారు.
అలాగే ఆలేరు మున్సిపాలిటీలో 3,324 నిర్మాణాలకు రూ.67.34లక్షల ఆస్తిపన్నుకుగాను రూ.13.55లక్షల చెల్లింపులు పూర్తయ్యాయి. పోచంపల్లి మున్సిపాలిటీలో 2,057 నిర్మాణాలకు సంబంధించి రూ.42.05లక్షల ఆస్తిపన్ను ఉంటే రూ.14.54లక్షలు, మోత్కూరు మున్సిపాలిటీలో 3,690 నిర్మాణాలకు చెందిన రూ.45.29లక్షల ఆస్తిపన్నుకుగాను రూ.8.19లక్షలు వసూలు అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీపై విస్తృత ప్రచారం నిర్వహించడంతోపాటు సిబ్బంది బృందాలుగా ఇంటింటికీ వెళ్లి పన్ను వసూలు చేయడంతో ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలు పన్నులను రాబట్టగలిగాయి.
భువనగిరి 105.63
చౌటుప్పల్ 183.53
యాదగిరిగుట్ట 3.43
ఆలేరు 13.55
పోచంపల్లి 14.54
మోత్కూరు 8.19
మొత్తం 328.87