సూర్యాపేట టౌన్, మే 1 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు కమ్ముకుంటాయని హేళన చేసిన వారి కళ్లు చెదిరేలా.. రాత్రివేళల్లో సైతం పగటి వెలుగును తలదన్నేలా రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నిరంతర విద్యుత్తో చేతినిండా పని కల్పించి కార్మికుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఆదివారం మేడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్లో టీఆర్ఎస్కేవీ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిదేండ్లుగా ఆకలి చావులు లేకుండా.. అందరికీ చేతినిండా పని కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటూ వారి కడుపు నింపుతున్నామన్నారు. నిరంతర విద్యుత్, పుష్కలమైన నీటితో పాటు ప్రశాంత వాతావరణం ఉండడంతోనే తెలంగాణలో పరిశ్రమలు పెరుగుతున్నాయన్నారు. పెద్ద వ్యాపారస్తులు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. దాంతో కార్మికులకు చేతినిండా పని లభిస్తున్నదన్నారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఘనత తెలంగాణ రాష్ర్టానికి, సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఎనిమిదేండ్లుగా రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుండగా.. ఇతర రాష్ర్టాల నుంచి కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున వలస వచ్చి ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక కుటుంబాలకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కల్పించిందన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సున్న కార్మిక కుటుంబాలన్నీ లేబర్ కార్డు పొందేందుకు అర్హులన్నారు. వీరు ఏడాదికి రూ.22 చొప్పున లేదా ఒక్కసారి 110 రూపాయలు చెల్లిస్తే ఐదేండ్ల్లపాటు ఈ కార్డు పనిచేస్తుందని, తిరిగి రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారని తెలిపారు.
లేబర్ కార్డు కలిగిన కార్మికులు సాధారణంగా మరణిస్తే రూ.3 లక్షలు, ప్రమాదానికి గురై మృతి చెందితే రూ.6 లక్షలు. పని చేయలేని పరిస్థితిలో ఉంటే రూ.2 లక్షల పరిహారం అందుతుందన్నారు. వారి కుటుంబంలో ఆడపిల్ల పెండ్లికి రూ. 30 వేలు, డెలివరీకి రూ. 30 వేలు అందుతాయన్నారు. కార్మికులందరూ లేబర్ కార్డు కలిగి ఉండాలని, ఆ బాధ్యత కార్మిక సంఘాల నాయకులు తీసుకోవాలని సూచించారు. ముందస్తుగా అందరి వివరాలు సేకరించాలని, డబ్బులు కట్టలేని పేద కార్మిక కుటుంబాలకు తానే స్వయంగా ఇన్సూరెన్స్ డబ్బులు చెలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అంతకు ముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన తాపీ పనివారల సంఘం భవనాన్ని మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని సూర్యాపేట నియోజక వర్గంలోని 6వేల ముస్లిం కుటుంబాలకు ద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తోఫా అందించారు. సొంత ఖర్చులతో డ్రైఫ్రూట్స్తో పాటు 10 రకాల పండుగ సరుకులను అందించారు. ఆదివారం ఉదయం సూర్యాపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ముస్లింలకు ప్రేమతో తోఫా పంపిణీని ప్రారంభించారు. ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు గతేడాది నుంచి మంత్రి జగదీశ్రెడ్డి తోఫా అందిస్తున్నారు.
దాంతో ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసంలో మానవీయ కోణంలో ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని ముస్లిం మతపెద్దలు సైతం కొనియాడారు. పలుప్రాంతాల్లో మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా ముస్లింల ఇంటికి వెళ్లి తోఫాను అందించారు. పట్టణంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, మండాలల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి తోఫాలు పంపిణీ చేస్తున్నారు.