భువనగిరి అర్బన్, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ హాల్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వానకాలం సీజన్లో జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, ఈ యాసంగిలో 1,65,718 ఎకరాల్లో వరి, 10,927 ఎకరాల్లో ఇతర పంటలు వేశారని తెలిపారు.
2021-22లో జిల్లాలో 281 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 38,887 మంది రైతుల నుంచి 2,83,054 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.554 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. రైతుబంధు పథకం కింద 2021 వానకాలంలో 2,14,417 మంది రైతులకు రూ.288 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, గత యాసంగి సీజన్లో 2,25,114 మందికి రూ.292 కోట్లు ఖాతాల్లో జమైనట్లు చెప్పారు.
రైతుబీమా పథకం కింద 2021-22లో 1,23,197 మంది రైతులను అర్హులుగా గుర్తించి బీమా నమోదు చేసినట్లు చెప్పారు. 2018 నుంచి ఇప్పిటి వరకు 2,314 మంది రైతులు మరణించగా రూ.5 లక్షల చొప్పున రూ.111.90 కోట్లు వారి నామినీ ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో 92 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు.
జిల్లాలో 26 లక్షలతో 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా జరిగాయన్నారు. ఇప్పటి వరకు 838 గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లాలో 161 పెద్ద చెరువులు, 1,043 చిన్న చెరువులు ఉన్నాయని, మూసీ పరీవాహక ప్రాంతంలో మరో 20 చెరువులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా మొత్తం 8,929 మంది మత్స్య కారులు జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. గత మార్చి వరకు జిల్లాలో 621 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
321 పరిశ్రమలు ప్రారంభం కాగా 23,904 మందికి ఉపాధి కల్పన జరిగినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు మార్చి వరకు 582 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు రూ.5 లక్షల 16వేల పనిదినాలు కల్పించి రూ.12కోట్ల 94లక్షలు జమచేయడం జరిగిందన్నారు. ఉపాధి పనుల ద్వారా 2022-23లో 49 లక్షల మొక్కలు నాటింపే లక్ష్యంగా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు.
ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రతినెలా 85,037 మందికి రూ.20కోట్ల 70లక్షలు చెల్లిస్తున్నామన్నారు. 83 సదరం క్యాంపులు నిర్వహించి 1,556 మందికి పరీక్షలు చేసి 1,235 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. జిల్లాలో 14,841 స్వయం సహాయక సంఘాల్లో 1,56,689 మంది సభ్యులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8,934 సంఘాలకు రూ.400 కోట్ల 50 లక్షల రుణాలు అందించామన్నారు. గ్రామీణ సడక్ యోజన కింద చేపట్టిన 16 రోడ్ల పనుల్లో 15 పురోగతిలో ఉన్నాయన్నారు.
గ్రామీణ మంచినీటి సరఫరా సంబంధించి 17 మండలాలకుగాను అంతర్గత పైప్లైన్, వాటర్ ట్యాంకుల నిర్మాణానికి సంబంధించి కొత్తగా 556 ట్యాంకులు పూర్తి చేశామన్నారు. 2008 కిలో మీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తి చేయగా 1,55,932 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 83 రైతు వేదికలు, 641 ప్రభుత్వ పాఠశాలలకు, 769 అంగన్వాడీ కేంద్రాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. నీటి పారుదలకు సంబంధించి 2021-22 సంవత్సరానికి 10 చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం హైడ్రాలిక్ అనుమతులు వచ్చాయని, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఓటీ-2 కాల్వ పనులు పురోగతిలో ఉన్నాయని, గండిచెరువు తూము, పైప్లైన్ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు.
6 చెక్ డ్యాముల నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతులు వచ్చాయని, 4 చెక్ డ్యాముల పనులు మొదలయ్యాని, 2 గ్రౌండింగ్ దశలో ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ కింద 57శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. గత మార్చి వరకు 17,333 మంది తల్లులకు కేసీఆర్ కిట్లు అందించినట్లు చెప్పారు. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేసి పారిశుధ్యం, మొక్కలకు వాటరింగ్ తదితర చర్యలతో గ్రామ సీమలు అభివృద్ధిలో పయనిస్తున్నాయన్నారు.
19 ఎస్సీ వసతి గృహాల్లో 1,503 మంది, 8 ఎస్టీ వసతి గృహాల్లో 850 మంది, 3 మైనారిటీ గురుకులాల్లో 1,183 మంది వసతి, విద్యా సౌకర్యం పొందుతున్నట్లు వివరించారు. దళితబంధు పథకం కింద వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున రూ.760కోట్లు విడుదలయ్యాయన్నారు. మన ఊరు-మనబడిలో జిల్లాలో ప్రథమ విడుతలో 251 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీహెచ్.కృష్ణారెడ్డి, ఎంపీపీలు, జడ్పీ టీసీలు, అధికారులు పాల్గొన్నారు.