ఆ ముగ్గురూ ప్రాణస్నేహితులు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. వృత్తి రీత్యా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో కలుసుకుని మంచీ చెడులు మాట్లాడుకుంటారు. శుక్రవారం సాయంత్రం కూడా అలాగే అక్కడికి చేరుకున్నారు.
సమయం : సాయంత్రం 6.52 గంటలు.యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డు, కెనరా బ్యాంకు ఏటీఎం పక్కన.ముగ్గురిలో ఒక్కరైన శ్రీనివాస్ బట్టల దుకాణం.
తెలిసిన వ్యక్తి మరణించడంతో ముగ్గురూ వెళ్లి చూసి షాప్ దగ్గరకు వచ్చారు. దుకాణం ముందున్న రేకుల షెడ్డు కింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. అక్కడే కూర్చొని ఉన్న బిల్డింగ్ ఓనర్ కూడా వీరితో జత కలిశారు. సరదాగా కబర్లు చెప్పుకొంటుండగా, ఒక్కసారిగా బిల్డింగ్ కంటె గోడ కుప్పకూలింది. రెప్పపాటులో రేకుల షెడ్డుమీద పడడంతో దాని కిందే ఉన్న స్నేహితులు సంచు శ్రీనివాస్(40), ఆర్ఎంపీ ఉపేందర్(40), శ్రీనాథ్(40), భవనం యజమాని గుండపల్లి దశరథ(70) శిథిలాల కింద చిక్కుకుపోయారు. చుట్టూ భీతావాహ వాతావరణం నెలకొంది. స్థానికులు, పోలీసులు కలిసి జేసీబీతో శిథిలాలు తొలగించి చూస్తే నలుగురూ విగత జీవులుగా పడి ఉన్నారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. కంటెగోడ కూలిన భవనం 30 ఏండ్ల కిందట నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు.
యాదాద్రి, ఏప్రిల్ 29 : సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం రెయిలింగ్ గోడ కూలి నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద సంఘటన యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణంలోని ప్రధానరోడ్డు కెనరా బ్యాంకు ఏటీఎం పక్కనే గుండ్లపల్లి దశరథ గౌడ్కు చెందిన రెండతస్తుల భవన ఉంది. ఈ భవంనలో శ్రీరాంనగర్కు చెందిన సుంచు శ్రీనివాస్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడికి అంగడిబజార్కు చెందిన ఆర్ఎంపీ ఉపేందర్, మార్కెట్కు చెందిన శ్రీనాథ్ స్నేహితులు. చిన్ననాటి నుంచి క్లాస్మెంట్స్. గుట్టలో తెలిసిన వ్యక్తి చనిపోవడంతో పార్థివ దేహానికి నివాళుర్పించారు.
సాయంత్రం జరిగే అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళ్లేందుకు శ్రీనివాస్ షాపు వద్దకు చేరుకున్నారు. షాపులోకి రాగానే కరెంట్ పోవడంతో బయటకు వచ్చి రేకుల షెడ్డు కింద నిల్చొని మాట్లాడుతున్నారు. అంతకుముందే గుండ్లపల్లి దశరథ, బ్యాటరి గిరి అక్కడే కూర్చుని మాట్లాడుతున్నారు. సరిగ్గా సాయంత్రం 6.52 నుంచి 6.55 మధ్యలో ఒక్కసారిగా భీకరమైన శబ్ధంతో బిల్డింగ్ కంటె గోడ కుప్పకూలింది.
రెప్పపాటులో రేకుల షెడ్డుమీద పడడంతో దాని కిందే ఉన్న స్నేహితులు సుంచు శ్రీనివాస్(40), ఆర్ఎంపీ ఉపేందర్(40), శ్రీనాథ్(40), భవనం ఓనర్ గుండపల్లి దశరథ(70) శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు కలిసి జేసీబీతో శిథిలాలు తొలగించి చూస్తే నలుగురూ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ గిరిని హుటాహూటిన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ దవాఖానకి తరలించారు. చిన్ననాటి మిత్రులతో పాటు భవన యజమాని ఒకేసారి మృత్యుఒడిలోకి చేరడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదంలో మృతి చెందిన గుండ్లపల్లి దశరథగౌడ్ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి వాణికి మామ. మృతుడు దశరథకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వారే. శ్రీరాంనగర్కు చెందిన సుంచు రాధమ్మ రెండో కుమారుడు సుంచు శ్రీనివాస్. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందారు. పెద్ద కుమారుడు సుంచు వెంకటేశ్ ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. శ్రీనివాస్కు కూతురు, కుమారుడు ఉన్నారు. అంగడిబజార్కు చెందిన సుంకి ఉపేందర్ తండ్రి సుంకి సత్యనారాయణ ఆర్ఎంపీ వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉపేందర్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యాదాద్రి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి తంగళపల్లి అనంతాచారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా శ్రీనాథ్ చిన్న కుమారుడు. శ్రీనాథ్కు కుమార్తె ఉంది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ దవాఖానలో పని చేస్తూ యాదగిరిగుట్టకు వస్తుంటాడు.