రాజాపేట, ఏప్రిల్ 27 : రాజకీయ లబ్ధి కోసమే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్యమయ్య పాదయాత్ర చేస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భిక్ష్యమయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తపాసుపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని, అప్పట్లో ప్రాజెక్ట్ ద్వారా రాజాపేట మండల రైతాంగానికి సాగు నీరు అందించాలనే సోయి ఆయనకు లేకుండా పోయిందన్నారు.
ఇప్పుడు రైతులపై కపట ప్రేమ ఒలక బోస్తూ సాగు జలాలు అంటూ రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరంతరం ఆలేరు అభివృద్ధి కోసం పరితపిస్తున్న ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డిని విమర్శించే స్థాయి భిక్షమయ్యకు లేదన్నారు. ఆలేరులో 60 ఏండ్లుగా జరుగని అభివృద్ధి నేడు ఎమ్మెల్యే సునీత సారథ్యంలో జరిగిందన్నారు. రైతులను రాజులుగా చూడాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపడానికి కాల్వల పనులు కొనసాగుతున్నాయన్నారు. గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఆలేరు నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు పల్లె సంతోష్గౌడ్, సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, సీసీ బ్యాంక్ చైర్మన్ చింతలపూరి భాస్కర్రెడ్డి, డైరెక్టర్లు చింతలపూరి వెంకట్రాంరెడ్డి, గుంటి కృష్ణ, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాపోలు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు, అధికార ప్రతినిధి ఎర్రగోకుల రాజు, రైతుబంధు సమితి అధ్యక్షుడు గౌటే లక్ష్మణ్, తిరుమలేశ్, వీరేశం, అనిల్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య
యాదగిరిగుట్ట రూరల్ : ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బూడిద భిక్షమయ్యగౌడ్కు సాగు నీరు ఎందుకు గుర్తుకు రాలేదని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ప్రశ్నించారు. బుధవారం మండలంలోని మల్లాపురం గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్పార్టీనే అధికారంలో ఉందని, మరి అప్పుడేం చేశారని ప్రశ్నించారు. నాడు గుర్తుకు రాని అంశం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. కేవలం రాజకీయం కోసం, తన ఉనికిని చాటుకునేందుకే ఆరాటపడుతున్నాడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అనేక సాగు నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయన్నారు. సమావేశంలో పార్టీ కార్యకర్తలు గోపగాని గోపాల్, కర్రె సత్యనారాయణ, గడసంతల వెంకటేశ్, ఒగ్గు కృష్ణ, జంగయ్య పాల్గొన్నారు.