యాదాద్రి, ఏప్రిల్ 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో స్వయంభువుల దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. యాదాద్రికి చేరుకున్న భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. క్యూ కాంప్లెక్స్లోని క్లాక్రూంల్లో మొబైల్ ఫోన్లు, బ్యాగును భద్రపర్చి, దర్శనం టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి క్యూలో నిలుచున్నారు.
తూర్పు ద్వారం నుంచి త్రితల రాజగోపురం గుండా స్వయంభువులను దర్శించుకున్నారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల వద్ద రద్దీ కనిపించింది. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల సందడి నెలకొంది. కొండకింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారికి నిత్యపూజలు తెల్లవారుజామున 4గంటల నుంచి మొదలయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. స్వామి సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం స్వామి వారి లడ్డూ ప్రసాదాలను భారీగా కొనుగోలు చేశారు. పాతగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. పాతగుట్టలో నిర్వహించిన నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. వేసవి వేడి నుంచి ఉపశమనానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
క్యూలైన్లలో నిలుచున్న భక్తులకు నీటి వసతి కల్పించడంతో పాటు, క్యూ కాంప్లెక్స్ ముందు భాగంలో టెంట్లు వేశారు. ఎప్పటికప్పుడు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకున్నారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి ఖజానాకు రూ. 16,96,589 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి బాలాలయంలో సీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సీతారాముల ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆలయ అర్చకులు శైవాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రీరాముడు, సీతాదేవిని ప్రత్యేకంగా అలంకరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు, పూజారులు పాల్గొన్నారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 61,600
వేద ఆశీర్వచనం 4,200
నిత్యకైంకర్యాలు 2,100
సుప్రభాతం 1,000
క్యారీబ్యాగుల విక్రయం 22,000
వ్రత పూజలు 87,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 24,400
ప్రసాద విక్రయం 10,71,150
వాహనపూజలు 10,700
సువర్ణ పుష్పార్చన 1,26,000
యాదరుషి నిలయం 62,500
అన్నదాన విరాళం 17,349
శాశ్వత పూజలు 1,57,500
పాతగుట్ట నుంచి 48,590
లక్ష్మీ పుష్కరిణి 200