యాదాద్రి, ఏప్రిల్ 24 : యాదాద్రి కొండపై రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. సోమవారం ఉదయం ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రి చేరుకోనున్నారు. ఉదయం 10.25 గంటలకు ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన శ్రీరాంపురం(తొగుట) పీఠాధిపతి పరమహంస, పరివ్రాజకాచార్య మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్ఫటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగ హోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దంపతులు పాల్గొంటారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. ప్రధానాలయంతో పాటు ఉపాలయాలపై కలశస్థాపన పనులు పూర్తయ్యాయి. ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగులు
స్తపతులు పూర్తి చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో 20వ సారి సోమవారం యాదాద్రికి చేరుకుని పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి నూతనాలయాన్ని ప్రారంభించనున్నారు. మొదటిసారిగా 2014అక్టోబర్ 17న సీఎం కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు. అదేఏడాది డిసెంబర్ 17న రెండోసారి, 2015 ఫిబ్రవరి 27న మూడోసారి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాలొన్న అనంతరం ఆలయ పనులను పరిశీలించారు.
అదే ఏడాది నాలుగో సారి యాదాద్రిని సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. 2015 జూలై 5న ఐదోసారి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 2016 మార్చి 17న 6వ సారి ప్రధానాలయంలో జరిగిన తిరుకల్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. 2016 అక్టోబర్ 19న ఏడోసారి యాదాద్రి పనులను పర్యవేక్షించారు. 2017 నవంబర్ 23న ఎనిమిదోసారి పర్యటించి పలు సూచనలు చేశారు.
తొమ్మిదోసారి 2017 అక్టోబర్ 24న యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని హంగులు సమకూరుస్తామని పునరుద్ఘాటించారు. 2019 ఫిబ్రవరి 3న పదోసారి యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అగస్టు 17న యాదాద్రిలో 11వ సారి పర్యటించారు. అనంతరం 2019లో డిసెంబర్ 17న 12వ సారి పర్యటించిన సీఎం పలు సూచనలు చేశారు. 2020 సెప్టెంబర్ 13వ సారి యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ పనుల పురోగతిపై కీలక సూచనలు చేశారు.
2021 మార్చి 5న సీఎం కేసీఆర్ 14వ సారి యాదాద్రిని సందర్శించి తుది మెరుగుల పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 15వ సారి 2021 జూన్ 21వ తేదీన వరంగల్ పర్యటన ముగించుకుని యాదాద్రి ఆలయ పనులను సమీక్షించారు. 16వ సారి అక్టోబర్ 19న యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్ ఆలయ పునఃప్రారంభం మహూర్తం ఖరారు చేశారు. ఈ ఏడాది ఫ్రిబవరి 7న 17వ సారి పునర్నిర్మాణ పనులను పరిశీలించి ఆలయ పునః ప్రారంభానికి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
అనంతరం ఫిబ్రవరి 12వ తేదీన యాదాద్రికి 18వ సారి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభించారు. మార్చి 28వ తేదీన 19వ సారి యాదాద్రికి చేరుకుని మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొని నూతనాలయాన్ని పునః ప్రారంభించారు. నేడు 20వ సారి యాదాద్రికి చేరుకుని రామలింగేశ్వరస్వామి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని శివాలయ నూతనాలయాన్ని పునఃప్రారంభించనున్నారు.
ఎప్పుడెప్పుడాన్ని ఎదురుచూస్తున్న రామలింగేశ్వరస్వామివారి దర్శనభాగ్యం సమయం రానే వచ్చింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధంగా ఉంటూ వస్తున్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వస్వామి దర్శనం నేడు భక్తులకు చేరువకానుంది. శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా సోమవారం అర్చకులు, రుత్వికులు, పారాయణీకులు, యజ్ఞాచార్యులు మంత్రోచ్ఛారణ నడుమ, డోలు సన్నాయి మోతల మధ్య మహాక్రతువు కొనసాగనుంది. ఇందుకు కావాల్సిన సకల ఏర్పాట్లు ఆలయ అధికారులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు.
శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టనున్నారు. అనంతరం మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిషా ్ఠయాగపరి సమాప్తి పలుకనున్నారు.