ఉత్సవమూర్తులకు అభిషేకం
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు
వైభవంగా శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజలు
శ్రీవారి ఖజానాకు రూ.24,11,359 ఆదాయం
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కుపూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. శ్రావణమాసంతో పాటు ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోసారి పోటెత్తింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూ కట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది.
యాదాద్రి, ఆగస్టు 29 : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు. మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. శ్రావణమాసంతోపాటు సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. స్వామివారి ప్రాంగణం పూర్తిగా భక్తులతో నిండిపోయింది. వాహనాల రాకతో కొండకింద ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సైతం భక్తుల రద్దీ భారీగా కొనసాగింది. భక్తులు అధిక సంఖ్యలో పూర్వగిరీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఉత్సవమూర్తులకు అభిషేకం..
యాదాద్రీశుడి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము 3గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
వైభవంగా వ్రత పూజలు..
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్దఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.2,13,500 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకున్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమలరెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
శ్రీవారి ఖజానాకు రూ.24,11,359 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.24,11,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ. 4,37,824, రూ.100 దర్శనంతో రూ. 26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ.4,20,000, నిత్యకైంకర్యాలతో రూ.600, సుప్రభాతం ద్వారా రూ.6,800, క్యారీ బ్యాగులతో రూ.3,000, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.2,13,500, కల్యాణకట్టతో రూ. 55,600, ప్రసాద విక్రయంతో రూ. 8,37,100, శాశ్వత పూజల ద్వారా రూ.20,580, వాహన పూజలతో రూ. 16,100, టోల్గేట్తో రూ.1,630, అన్నదాన విరాళం తో రూ.6,709, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,75,120, యాదరుషి నిలయంతో రూ. 82,420, పాతగుట్టతో రూ.1,07,460తో కలుపుకుని రూ. 24,11,359 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
స్వామివారి హుండీ ఏర్పాటుకు రూ.5లక్షలు విరాళం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో స్వామివారి హుండీ ఏర్పాటుకు సికింద్రాబాద్కు చెందిన ఓ భక్తులు ముందుకు వచ్చాడు. అఖిల భారత పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్ కె.గోరంటి రూ.5లక్షల చెక్కును ఆదివారం యాదాద్రి ఈవో కార్యాలయంలో ఆలయ ఈవో ఎన్.గీతకు అందజేశాడు.