యాదాద్రి, సెప్టెంబర్ 26 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని తరించారు. పలువురు భక్తులు సువర్ణపుష్పార్చనలో పాల్గొని స్వామివారి వేద ఆశీర్వచనం తీసుకున్నారు. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టి హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. మరోవైపు స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీ లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. అమ్మవారికి సాయంత్రం కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వగిరి(పాతగుట్ట)లో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నిత్యకైంకర్యాలు సంప్రదాయబద్దంగా సాగాయి. యాదాద్రీశుడిని దర్శించుకున్న భక్తులు పాతగుట్ట నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ.15,47,185 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
అక్టోబర్ 7 నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామివారి బాలాలయంలో అక్టోబర్ 7 నుంచి 15వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9 రోజుల పాటు పూజల్లో పాల్గొనే దంపతులు రూ.1,116, నవరాత్రిలో ఒక్కరోజు సప్తశతి పారాయణం కోసం రూ.116, లక్ష కుంకుమార్చనకు రూ.116 చెల్లించాలని తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,53,650
రూ.100 దర్శనం టిక్కెట్ 19,600
వీఐపీ దర్శనాలు 1,73,250
వేద ఆశీర్వచనం 10,836
సుప్రభాతం 2,200
ప్రచారశాఖ 220
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 40,500
కల్యాణకట్ట టిక్కెట్లు 32,000
ప్రసాద విక్రయం 7,13,190
వాహన పూజలు 16,500
టోల్గేట్ 2,530
అన్నదాన విరాళం 8,381
సువర్ణ పుష్పార్చన 1,34,500
యాదరుషి నిలయం 75,560
పాతగుట్ట నుంచి 30,770
గోపూజ 650