నాడు అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం.. నేడు ప్రగతి పథంలో ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఎటు చూసినా పరిశుభ్రత, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తున్నది. వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణాలు అభివృద్ధిని కండ్లకు కడుతున్నాయి.గుడిమల్కాపురం గ్రామ జనాభా 3,204. గ్రామంలో 871 కుటుంబాలు ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన పది ఇండ్లను పల్లె ప్రగతి కార్యక్రమంలో కూల్చివేశారు. గ్రామంలో ప్రతి నెలా 268 మందికి ఆసరా పింఛన్ అందుతున్నది. ఇప్పటి వరకు రైతుబీమా ద్వారా నాలుగు కుటుంబాలు లబ్ధి పొందాయి.
గ్రామంలో రెండేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేసి వేర్వేరుగా సేకరిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా రోజు విడిచి రోజు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రూ.4 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2.30 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి 4 వేల పూలు, పండ్ల మొక్కలను నాటించారు. రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ. లక్షతో నర్సరీ ఏర్పాటు చేశారు. ఇటీవల రూ.12 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో మట్టి రోడ్డు నిర్మించారు. రూ.10 లక్షలతో ట్రాక్టర్, వాటర్ ట్యాంక్, ట్రాలీ కొనుగోలు చేశారు.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
గ్రామంలో విశాలమైన పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు పలు రకాలు ఔషధ మొక్కలు సైతం నాటించారు. వాకింగ్ ట్రాక్ నిర్మించడంతో పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లగానే ఆహ్లాదకరమైన వాతావరణం హత్తుకుంటుంది. డంపింగ్ యార్డులోనూ పచ్చదనం పెంచుతున్నారు.
పల్లె ప్రగతితో ఎంతో అభివృద్ధి..
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. ఊరంతా పచ్చగా, పరిశుభ్రంగా మారింది. ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. పల్లె ప్రకృతి వనంలో మొక్కలను నాటి సంరక్షిస్తున్నాం. ఎమ్మెల్యే సూచనలు, సహకారాలతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు శ్రమిస్తున్నాం. గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల సహకారం మర్చిపోలేనిది.
పెరుగు పద్మావతీసుబ్బారావు, సర్పంచ్
గ్రామస్తుల భాగస్వామ్యం బాగుంది
గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామస్తులంతా ఐక్యంగా సహకరిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజల సమష్టి భాగస్వామ్యంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశాం. చెత్త సేకరణ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాం. గ్రామంలో 100శాతం పన్నులు వసూలు చేస్తున్నాం.
మాలోతు కిషన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి