భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణపతి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. 9 రోజులపాటు పూజలందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లాలో 2,408 విగ్రాహాలను ఏర్పాటు చేయగా ఆదివారం పెద్దమొత్తంలో నిమజ్జనం చేయగా మిగిలి వాటిని సోమవారం చేయనున్నారు. ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణలో గణపతి శోభాయాత్ర అర్ధరాత్రి వరకు జరిగింది. భువనగిరి పట్టణంలో ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో 137 పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో సాయంత్ర 3 గంటల నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అర్ధరాత్రి వరకు ముగియగా, చిన్న విగ్రహాల నిమజ్జనం సోమవారం తెల్లవారు జాము వరకు కొనసాగింది.
భారీ పోలీస్ బందోబస్తు…
గణపతి శోభాయాత్రలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీపీ మహేశ్ భగవత్ పర్యవేక్షించించిన సురక్షితమైన చోటనే నిమజ్జనాలు జరిగేలా డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగిన నిమజ్జనాల్లో 1000 మందికి పైగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. భువనగిరి పట్టణంలో శోభాయాత్రను సీసీ కెమెరాల నిఘాలోకొనసాగింది. పెద్ద చెరువు వద్ద ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
నిమజ్జనంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..
భువనగిరి పట్టణంలోని సిగ్ధాకాలనీలో నిర్వహించిన గణపతి శోభాయాత్రను ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా పట్టణంలో జరుగుతున్న గణపతి శోభాయాత్ర, పెద్ద చెరువు వద్ద నిమజ్జన కార్యాక్రమాలను డీసీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఏసీపీ వెంకట్రెడ్డి, సీఐ సుధాకర్, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేవరకొండ నర్సింహాచారి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
యాదాద్రి/బీబీనగర్/చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్/సంస్థాన్నారాయణపురం : నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. మధ్యాహ్నం ప్రారంభమైన ఊరేగింపులు రాత్రి వరకు కొనసాగాయి. ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం మినహా మిగతా మండలాల్లో వందలాది విగ్రహాలను ఆయా గ్రామాలు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. గణేశుడి శోభయాత్ర సందర్భంగా యువత పెద్దఎత్తున నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. నిమజ్జనం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఆయా మండపాల ఉత్సవ సమితీల ఆధ్వర్యంలో లడ్డూల వేలం నిర్వహించారు. లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. బీబీనగర్ మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో విగ్నేశ్ వద్ద భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పూజలు చేశారు. అనంతరం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానంలో పాల్గొన్నారు. సంజీవయ్య కాలనీలో జగ్జీవన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేశ్ను భువనగిరి రూరల్ సీఐ జానయ్య దర్శించుకొని పూజలు చేశారు. యాదగిరి గుట్ట సీఐ నర్సయ్య శుభాశ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించారు. చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురంలోనూ గణేశ్ నిమజ్జనం చేశారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో లడ్డూను గుర్రం లావణ్య శ్రీనివాస్రెడ్డి దంపతులు రూ.87,500, శాలువాను పాటి హేమలత, మల్లారెడ్డి రూ.21,100 దక్కించుకున్నారు.