మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా సంబురంగా జరుపుకున్నారు. కలెక్టరేట్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా సాగిన ఈ వేడు కలకు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీసీపీ నారాయణరెడ్డి హాజరయ్యారు. విధుల్లో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేశారు.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని రంగాల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, ఈ ఏడాది యాసంగి సీజన్లో 2,09,662 మంది రైతులకు 289 కోట్ల 17లక్షలు, వానకాలంలో 2,14,417 మంది రైతులకు 287 కోట్ల 59 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా పథకంలో భాగంగా మరణించిన 1,682 రైతులకు గాను రూ.84కోట్ల 10 లక్షలను వారి నామినీలకు చెల్లించామన్నారు. పెట్టుబడి సాయం తో రైతాంగాన్ని ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 8 విడతలుగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.164కోట్ల 30 లక్షలను వారి ఖాతాల్లో జమచేశామన్నారు. రైతాంగానికి 50వేల చొప్పున రుణమాఫీ చేయాలని తలచడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రూ.50వేల రుణమాఫీ కింద రూ.55కోట్లు రైతుల ఖాతాల్లో జమకానుందని ఆమె తెలిపారు.
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో శిథిలావస్థకు చేరిన 1,732 ఇండ్లు, నిరుపయోగంగా ఉన్న 82 బోరు బావులు, వాడకంలో లేని 192 బావులను పూడ్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 92 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కాగా, వాటిల్లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో రైతులకు శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 6 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను రూ.12కోట్ల 50లక్షలతో చేపట్టగా, అవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆరు మున్సిపాలిటీల్లో 169 పబ్లిక్ టాయిలెట్స్ను, 37 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 22లక్షల మొక్కలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నాటామని, ఉపాధిహామీ పథకం కింద 391 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు పూర్తయ్యాయన్నారు. మరో 30 గ్రామాల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
పకడ్బందీగా కట్టడి చర్యలు చేపట్టి జిల్లాలో కరోనాను నియంత్రించగలిగామన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా 4,08,687 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 31,871మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, ప్రభుత్వం అందించిన తక్షణ వైద్యంతో 31,134 మంది కోలుకున్నట్లు తెలిపారు. మిగిలినవారు హోంఐసొలేషన్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన 3,55,485 మందికి కరోనా టీకాలు ఇచ్చామన్నారు.
మిషన్ భగీరథ పథకం కింద భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 549 ఆవాసాలకు రూ.750కోట్ల ఖర్చుతో కృష్ణా, గోదావరి తాగునీటి సరఫరా జరుగుతున్నదని వివరించారు. 1,55,932 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి 771 ఆవాసాల్లో మిషన్ భగీరథ సురక్షిత తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వ వెడల్పు పనులకు రూ.284.85 కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 14, 15, 16 పనులు పురోగతిలో ఉన్నాయని.. కాల్వలు, రిజర్వాయర్ల కోసం ఇప్పటి వరకు 4,643 ఎకరాలు భూసేకరణ జరిగినట్లు తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్లో 1.5 టీఎంసీ నీటిని నిల్వ ఉంచేలా పనులు జరుగుతున్నాయన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించగా..కొవిడ్ కారణంగా వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన 14మందికి అవార్డులను అందజేశారు.
అభివృద్ధి, సంక్షేమ పరంగా ముందడుగు..
అభివృద్ధి, సంక్షేమ పరంగా జిల్లా ముందడుగు వేస్తున్నదన్నారు. 625 రెండు పడకల గదుల ఇండ్లు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. యాసంగిలో 292 కొనుగోలు కేంద్రాల ద్వారా 59,711 మంది రైతుల నుంచి 4,23,132 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.795కోట్ల చెల్లింపులను పూర్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణలోనే పాల ఉత్పత్తిలో యాదాద్రి జిల్లా ప్రథమ స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. పాల ఉత్పత్తిలో జిల్లాను అగ్రగామిగా నిలిపిన పాడి రైతులను అభినందించారు. ‘నేతన్నకు చేయూత’ పథకం కింద 5,380 మంది చేనేత కార్మికులకు రూ.21.48కోట్లు, చేనేత మిత్ర ద్వారా 10,219 మంది చేనేత కార్మికులకు 40శాతం నూలు సబ్సిడీ కింద రూ.5కోట్లు విడుదల చేశామని, బ్యాంకు లింకేజీ కింద 2,073 సంఘాలకు రూ.66కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆసరా పథకం కింద 87,739 మంది లబ్ధిదారులకు రెట్టింపు చేసిన పెన్షన్లతో నెలకు రూ.20.14కోట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీల్లో 6,617 మంది వీధి వ్యాపారులకు డిజిటల్ చెల్లింపుల ద్వారా రుణాలను మంజూరు చేశామన్నారు. దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించినందున గర్విస్తున్నానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. దళిత కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ-పాస్ పుస్తకం జారీ చేస్తూ రెవెన్యూ చట్టంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలోని 17 మండలాల్లో 24,671 రిజిస్ట్రేషన్లు జరిపి ఈ-పాస్ పుస్తకాలను రైతులకు జారీ చేయడం జరిగిందన్నారు. రాచకొండ పోలీసులు ఫ్రెండ్లీ విధానాన్ని జిల్లాల్లో అమలు చేస్తూ రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచినందున ప్రభుత్వ విప్ అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, డీఆర్డీవో పీడీ ఉపేందర్రెడ్డి, జడ్పీ సీఈవో క్రిష్ణారెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.