పునరావాస చర్యలు వెంటనే చేపడుతాం
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెరుగైన పరిహారం అందిస్తాం
కలెక్టర్ పమేలా సత్పతి భరోసా
బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులతో సమావేశం
బస్వాపూర్ నృసింహ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులెవ్వరూ అధైర్యపడొద్దు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ పరిగణలోకి తీసుకుంటాం. బీఎన్.తిమ్మాపురం గ్రామంలోని 1,085 మందికి ఇంటిస్థలంతో పాటు రూ.7,61,000 పరిహారం అందిస్తాం. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో
లే అవుట్ అభివృద్ధి చేసి 200 గజాల చొప్పున ఇస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పునరావాస ప్యాకేజీ అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్8: బస్వాపూర్ (నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్టర్ పమేలాసత్పతి తెలి పారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బీఎన్ తిమ్మాపురం గ్రామ రైతులు, రెవెన్యూ, ఇరిగేషన్ ఆయా శాఖల అధికారులతో ఆమె మాట్లాడారు. పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగకుండా చూడాలని రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అధికారులు కూడా నిజాయితీగా పనిచేసి రైతులకు నష్టం కలుగకుండా నివేదికలు, ఇండ్లు, భూముల వివరాలు ఇవ్వాలని బీఎన్ తిమ్మాపురం రైతులు కలెక్టర్ను, ఇతర అధికారులను కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి అవకాశాన్నీ కల్పిస్తామని తెలిపారు. గ్రామంలోని 594 ఇండ్లకు సంబంధించి 641 కుటుంబాలు ఉన్నందున ప్రభుత్వ ఉత్తర్వులు 125 ప్రకారం పునరావాసం కల్పించనున్నట్లు చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారందరినీ పరిగణలోకి తీసుకోగా 1085మందికి ఇంటి స్థలంతో పాటు రూ.7,61,000 పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన పునరావాస ప్యాకేజీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఇందుకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 200 గజాల చొప్పున లే అవుట్ అభివృద్ధి చేసి అప్పగిస్తామని కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ సూరజ్కుమార్, తాసీల్దార్ శ్యాంసుందర్రెడ్డి, అధికారులు, గ్రామస్తులు, వివిధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.