ఐదేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించాం
సీసీఎఫ్ ఎంజే అక్బర్
లక్కారంలోని తంగేడు వనం సందర్శన
చౌటుప్పల్, సెప్టెంబర్7 : హరితహారం నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, 2015 నుంచి ఐదేండ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించామని సీసీఎఫ్(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఎంజే అక్బర్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలోని తంగేడువనాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడ పెంచిన యాదాద్రి ఫారెస్ట్ను పరిశీలించారు. రెండేళ్లలో చిట్టడివిని ఏర్పాటు చేయడంపై ఫారెస్ట్ సిబ్బందిని అభినందించారు. అనంతరం స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో డీఎఫ్ఓ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీడీఓ రాకేశ్రావుతో సమావేశమై హరితహారంలో భాగంగా పెంచిన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ముందు తెలంగాణలో అటవీ విస్తీర్ణం పూర్తిగా పడిపోయిందని, సీఎం కేసీఆర్ ఇచ్చిన జంగల్ బడావో.. జంగల్ బచావో పిలుపు మేరకు పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టామన్నారు. గతంలో కనిపించకుండా పోయిన పెద్ద పులులు రాష్ట్రంలోని ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో సాక్షాత్కరిస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతున్నదని, గ్రామాలన్నీ పచ్చని వనాలుగా మారుతున్నాయని చెప్పారు. పల్లెల్లో ప్రకృతి వనాలు, అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ పార్కులు పెరుగుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీల్లో 10శాతం నిధులు మొక్కల పెంపకానికి వినియోగించడంతో రోజురోజుకూ పచ్చదనం విస్తరిస్తున్నదని తెలిపారు. లక్కారంలోని యాదాద్రి ఫారెస్ట్ రాష్ర్టానికే ఆదర్శమని, అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఈ తరహా అడవులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో 100పైగా ఫారెస్ట్ బ్లాక్లు ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారి వెంట నాలుగు, ఐదు వరుసల్లో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గడ్డి మైదానాలు పెంచుతున్నామని, దీంతో జింకల సంతతి పెరిగిందన్నారు. గ్రామాల్లోని కోతులను తిరిగి అడవుల్లోకి పంపించేందుకు మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లక్కారంలోని తంగేడు వనాన్ని పాఠశాలలు, కళాశాల విద్యార్థులు సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎఫ్ఓ వెంకటేశ్వర్రెడ్డి, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ వెంకట్రాములు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.
ప్రతి మొక్కనూ సంరక్షించాలి
వలిగొండ, సెప్టెంబర్ 7 : మండలంలోని నెమిలకాల్వలో పల్లె ప్రకృతి వనాన్ని, పలు అభివృద్ధి పనులను, హరితహారంలో నాటిన మొక్కలను చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంజే అక్బర్ మంగళవారం పరిశీలించారు. లోతుకుంట గ్రామంలోని మోడల్ పాఠశాలను సందర్శించి మొక్కల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గీతారెడ్డి, ఎంపీఓ కేదారీశ్వర్, ఏపీఎం శ్రీ లక్ష్మి, సర్పంచులు వంగాల భిక్షపతి, రాచకొండ బచ్చయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.