యాదాద్రిలో నేటి నుంచి ఆర్జిత సేవలు
భక్తుల కోరిక మేరకు పునఃప్రారంభం
ఆలయ పరిసరాల్లో శానిటైజేషన్ పూర్తి
భక్తులకు కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
యాదాద్రి, ఏప్రిల్ 3 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం స్వామివారికి సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. అనంతరం సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. స్వామివారి బాలాలయంలో రోజూ జరిగే నిత్యకల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన వైభవంగా జరిగాయి. కొండకింద గల శిల్పారామంలో జరిగిన శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. యాదాద్రీశుడి బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసిఅర్చనలతోపాటు నిత్య పూజలు వైభవంగా కొనసాగాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా స్వామివారి సేవల్లో భక్తులకు అనుమతి ఇవ్వలేదు.
ఆర్జిత సేవలకు ఏర్పాట్లు..
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వారం రోజులుగా నిలిచిపోయిన ఆర్జితసేవలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ స్వామివారి సేవల్లో భక్తులు పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. మార్చి 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలు నిలిపివేశారు. మార్చి 26, 27వ తేదీల్లో మాత్రమే భక్తులకు ఆర్జిత సేవల్లో పాల్గొనే భాగ్యం కలిగింది. అనంతరం యాదాద్రిలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి కరోనా సోకడంతో మార్చి 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆర్జిత సేవలు, నిత్యాన్నదానం రద్దు చేశారు. భక్తుల కోరిక మేరకు కొవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవలు, నిత్యాన్నదానాలకు ఆలయ ఈవో ఎన్. గీత అనుమతి ఇచ్చారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది ముంద స్తు చర్యలు చేపట్టారు. బాలాలయంలో కల్యాణం, నారసింహహోమంలో పాల్గొనే భక్తులు కూర్చునే ప్రాంతం, బాలాలయంలో క్యూలై న్లు, పురవీధులు, వీఐపీ, రూ. 100 దర్శనం క్యూలైన్లలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ముఖ్యంగా స్వామివారి కల్యాణం, సుదర్శన నారసింహహోమంలో పాల్గొనే భక్తులకు పరిమితి సంఖ్యలో అనుమతి ఇవ్వనున్నారు. మాస్కు లేని వారికి ఆర్జిత సేవలకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.