మియాపూర్ : డైనేజీ, రహదారులు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతులను కల్పించి కాలనీల అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానని ప్రభుత్వ విప్ ఆరికపూడి గాంధీ అన్నారు. సంక్షేమ సంఘాలు సైతం కాలనీ పురోగతితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా భాగస్వాములు కావాలన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ ప్రతినిధులు విప్ గాంధీని వివేకానందనగర్లోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని విప్ గాంధీ అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తాను కాలనీలకు ఎల్లపుడూ అందుబాటులో ఉండి వాటి బాగోగుల కోసం కృషి చేస్తానన్నారు. ప్రజలను సమన్వయం చేసుకుని సమిష్టిగా కాలనీ సంఘాలు ముందుకు సాగాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్రావు, ప్రతినిధులు దశరథరావు, విద్యాధర్చారి, రమేశ్ చంద్ర, సురేశ్,విరూపాక్షయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ను మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కార్పొరేటర్ శ్రీకాంత్ అభినందించారు. కాలనీ పురోగతికి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.