బంజారాహిల్స్ : కొవిడ్ సమయంలో విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ను పలువురు ఆశావర్కర్లు కలిసి తమ సమస్యలను వివరించారు.
తమ కష్టానికి తగిన వేతనం రావడం లేదని, వేతన పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి కూడా పాల్గొన్నారు.