జగిత్యాల రూరల్, మార్చి 30 : ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే మధుయాష్కీకి గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగు, సాగునీటి కోసం ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యతనిచ్చారన్నారు. నియోజక వర్గంలో సైతం రూ.నాలుగు కోట్లతో అనేక గ్రామాల్లో చెక్డ్యాంలు నిర్మించామన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు. గడిచిన ఏడేళ్లలో కేంద్రం ఒక్క గోదాం కూడా కట్టలేదని విమర్శించారు. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు మధుయాష్కీ ఏం అభివృద్ధి చేశాడో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డు కోసం ఎక్కని మెట్టు లేదన్నారు. పసుపు పండించే రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సైతం కలిశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని మధుయాష్కీ తెలుసుకోవాలన్నారు. నిజామాబాద్ చెరుకు ఫ్యాక్టరీ కోసం మధుయాష్కీ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. వీలైతే రైతుల పక్షాన నిలువాలని, రాహుల్ గాంధీ రైతుల పక్షాన పోరాడేలా కృషి చేయాలని మధుయాష్కీకి హితవు పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల, రాయికల్ పట్టణాధ్యక్షులు గట్టు సతీశ్, ఇంతియాజ్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మండలాధ్యక్షుడు బాల ముకుందం, కోల శ్రీనివాస్, నారపాక రమేశ్, గుర్రాల రాజేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, నాయకులు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.