అబిడ్స్ : ఎయిడ్స్ రహిత సమాజం కోసం యువత, స్వచ్చంద సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి వారిని చైతన్య పర్చాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతూ నివారణ చర్యలు తీసుకుంటోందన్నారు.
తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రూపొందించిన వాల్ పోస్టర్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఉండడం పట్ల డాక్టర్ రాజ్నారాయణ్ ముదిరాజ్ను అభినందించారు. అనంతరం డాక్టర్ రాజ్నారాయణ్ ముదిరాజ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి నగరంలో ఎయిడ్స్ వ్యాధిపై ర్యాలీలు, అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ నగరంలోని మురికి వాడలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ అద్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్రావు, విద్యావేత్త, సూపర్ గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ మహ్మద్ ముజఫర్ మొయిద్దీన్, ప్రముఖ న్యాయవాది ఆలె నాగేశ్వరరావు, కో ఆర్డినేటర్ బత్తుల హేమంత్, రాదారి రాంమోహన్ గౌడ్, డాక్టర్ ఎం ఇసాక్రాజ్లు పాల్గొని ప్రసంగించారు.