బన్సీలాల్పేట్ : లబ్ధిదారుల సమక్షంలో అర్హులను ఎంపిక చేస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మత్స్య, పాడి, పశు సంవర్థక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సోమవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయ సెమినార్ హాల్లో జిహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, హౌజింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారి, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలత, జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, హౌజింగ్ సీఈ కిషన్, ఈఈ వెంకట్దాస్ రెడ్డి, జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణ, సికింద్రాబాద్, ముషిరాబాద్, అమీర్పేట్, ఖైరతాబాద్ మండలాల తహసిల్దార్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్ సంకల్పంతో పూర్తిగా ప్రభుత్వమే అన్ని ఖర్చులను భరిస్తూ, సకల సదుపాయాలతో రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా స్థానిక ప్రజల సమక్షంలో లాటరీ పద్దతిలో లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని అన్నారు.
అదే విధంగా, బన్సీలాల్పేట్ డివిజన్లోని చాచానెహ్రూనగర్, బండమైసమ్మ నగర్ బస్తీలలో ఇండ్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయని, వచ్చే నెలలో లబ్ధిదారులకు వాటిని అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ పైప్లైన్, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, రోడ్లు లాంటి పనులను వేగవంతంగా చేసి, సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఇండ్ల ప్రారంభోత్సవానికి ముందే స్థానిక బస్తీవాసుల ముందు అర్హులను గుర్తించి లబ్దిదారుల జాబితాను సిద్దం చేయాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.