సంప్రదాయ పంటలతో ఆశించిన లాభాలు రావడం లేదని ఇతర పంటలపై దృష్టి పెట్టాడు. మార్కెట్లో డిమాండ్ ఉన్న మునగకాయ సాగు చేసి కేవలం 20 గుంటల్లో లక్షా రూ.20వేల ఆదాయం పొందుతున్నాడు. వాటితో పాటు సజ్జ, మక్కజొన్న వేయడం కలిసి వస్తోందంటున్నాడు ఎల్కతుర్తి మండలం దామెర రైతు రాజేందర్రెడ్డి.
– ఎల్కతుర్తి, మే 8
ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన బరీదుల రాజేందర్రెడ్డికి 6.20 ఎకరాల భూమి ఉంది. ఇందులో సంప్రదాయ పంటలైన వరి, పత్తి పండించేవాడు. అయితే లాభాలు అంతంత మాత్రమే వస్తుండడంతో నిరాశ చెందాడు. అయితే లాభాలు ఎక్కువగా వచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు వేయాలనుకున్నాడు. వరి, పత్తి స్థానంలో మునగ, సజ్జ, మక్క పంటలను వేశాడు. 20గుంటల్లో మునక్కాయ, ఎకరంలో సజ్జ, 4.20 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేస్తున్నాడు. ఇందులో మునక్కాయ పంట తనకు బాగా కలిసివచ్చిందని చెబుతున్నాడు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గుచూపిన రాజేందర్రెడ్డి.. 2019 నుంచి మునక్కాయ సాగుచేస్తున్నాడు. ఏటా జనవరిలో మొదలై జూన్ వరకు కాయలు చేతికొస్తాయి. ఈ మాసాల్లో పెళ్లిల్లు, ఫంక్షన్లు ఎక్కువగా జరుగడం వల్ల మునక్కాయలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మూడు, నాలుగు రోజులకోసారి సుమారు 1000 కాయలు తెంపి హనుమకొండలో కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు రూ.3చొప్పున విక్రయిస్తాడు. ఫలితంగా రూ.3వేల వరకు లాభం ఉంటుందని, అన్ని ఖర్చులు పోను ఆరు నెలల పంట కాలంలో రూ.లక్షా 20వేల వరకు మిగులుతాయని చెబుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 20కి మూడు మునక్కాయలను మాత్రమే వినియోగదారులకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రైతు విక్రయించిన ధర కంటే రెండు రెట్లు ఎక్కువగా వ్యాపారులు మునక్కాయలను అమ్ముకుంటున్నారు. రైతులే స్వయంగా మార్కెట్లో విక్రయించినట్లయితే ఇంకా ఎక్కువ లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ యేడు ఎకరం విస్తీర్ణంలో సజ్జ పంటను కూడా సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా రాజేందర్రెడ్డి నిలుస్తున్నాడు.
ఇదివరకు వరి, పత్తి పంటలే వేసేది. రానురాను లాభాలు ఎక్కువగా వస్తలేవు. అందుకే మార్కెట్లో ఎక్కువ అమ్ముడుబోయే పంటలే ఏయాలనుకున్న. 20గుంటల్ల మునక్కాయ తోటపెట్టిన. మార్కెట్లో ఒక్కో మునక్కాయ 7 రూపాయలకు అమ్ముతరు. కానీ మేము ఎవుసం పని తీరిక గుత్త లెక్క అమ్ముతున్న. కాయ 3 రూపాయలకే ఇస్త. నాకైతే మునక్కాయతోటి లాభం మంచిగున్నది. అట్లనే ఈ యేడు కొత్తగా సజ్జ పంట కూడా వేసిన.
– బరీదుల రాజేందర్రెడ్డి, రైతు