గిర్మాజీపేట, ఏప్రిల్ 11: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొరివి పెట్టడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా ఎర్రబెల్లి యువసేన ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో సోమవారం ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులపై వివక్ష చూపడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి వరి సాగు చేయించారని, నేడు అదే నాయకులు కేంద్రం కొనుగోలు చేసేలా కృషి చేయకపోవడం వారి దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో బూటకపు హమీలిచ్చి గద్దెనెక్కాక మోదీ రాష్ట్ర ప్రజలకు మొండిచేయి చూపడం దారుణమన్నారు. ఆరుగాలం కష్టపడి వరి సాగు చేసిన రైతులను మోసం చేయడమే బీజేపీ ప్రభుత్వ ధ్యేయమా? అని ప్రశ్నించారు. బీజేపీ గద్దెనెక్కాక వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి పేదలపై భారం మోపారని తెలిపారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే తెలంగాణలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వంతో కొనుగోలు చేయించాలని, లేని పక్షంలో ఆ పార్టీ నాయకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎర్రబెల్లి యువసేన నాయకులు పాల్గొన్నారు.