గీసుగొండ, ఏప్రిల్ 11: తెలంగాణ స్టేట్ హ్యాండ్ లూమ్స్ సంస్థ (టెక్సో) ద్వారా హాస్టల్ విద్యార్థులకు అవసరమ్యే దుస్తులను భద్రపరిచే గోదాంలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సుమారు రూ. 35 కోట్ల విలువైన దుస్తులు మంటల్లో కాలిబుడిదయ్యాయి. వరంగల్ ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఈ గోదాముకు విద్యుత్ సరఫరా కూడా లేదు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. టెక్సో ఆర్ఎంవో శ్రీనివాస్, ఏఎంవో మొరం శ్రీనివాస్, డీఈవో సత్యనారాయణ వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ఐదు జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు దుస్తులు, బెడ్షీట్స్, కార్పెట్లు, షర్టింగ్, సూటింగ్, బ్లౌజ్లు, వోనిలు, క్లాత్లకు సంబంధించిన మెటీరియల్ సరఫరా చేసేందుకు టెక్సో సంస్థ గ్రేటర్ వరంగల్ పరిధి 16వ డివిజన్ ధర్మారం శివారులోని గోదాంను లీజుకు తీసుకుని వివిధ ప్రాంతాల్లో మగ్గంపై నేసిన దుస్తులను తీసుకొచ్చి భద్రపరిచింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా దుస్తులను ఈ గోదాం నుంచి సరఫరా చేస్తారు. కరోనా వైరస్ కారణంగా మూడేళ్ల నుంచి గురుకులాలకు దుస్తుల సరఫరా నిలిచిపోయింది. గోదాంలో సుమారు రూ. 35 కోట్ల విలువైన దుస్తులు నిల్వ ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం 6 గంటలకు గోదాంకు తాళం వేసి సిబ్బంది, అధికారులు వెళ్లిపోయారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో గోదాం అగ్ని ప్రమాదానికి గురైనట్లు ఫోన్లో అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే అధికారులు గోదాం వద్దకు చేరుకుని ఫైర్ ఇంజన్కు సమాచారం అందించారు. దీంతో ఆరు ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ సిబ్బంది గోదాంలో మంటలను అదుపులోకి తెచ్చినట్లు టెక్సో ఆర్ఎంవో శ్రీనివాస్, ఏఎంవో మొరం శ్రీనివాస్, డీఈవో సత్యనారాయణ వెల్లడించారు. ఘటనకు సంబంధించి గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. కాగా, గోదాంకు ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని స్థానికులు తెలిపారు.