తీరొక్క మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లె ప్రకృతి వనాలు.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడమే గాక.. గ్రామాలకు కొత్తదనం తెచ్చాయి. ఒకప్పుడు ముళ్లపొదలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా కమలాపూర్ మండలంలో ఏర్పాటుచేసిన ఈ వనాలు.. సకల హంగులతో ముస్తాబై పట్టణంలోని పార్కులను తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
– కమలాపూర్, మే 11
పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలకు కొత్తకళ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో గ్రామాలను తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా కమలాపూర్ మండలంలోని కమలాపూర్, ఉప్పల్, మర్రిపల్లిగూడెం, గూడూరు, శనిగరం, అంబాల, శ్రీరాములపల్లి తదితర గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కమలాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గతంలో చెరువు(కుంట)లో ముళ్లపొదలు అల్లుకుపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. నేడు కేసీఆర్ సర్కారు నిర్ణయంతో అధికారులు కుంటలోని ముళ్లపొదలు తొలగించి పల్లె ప్రకృతి వనం సిద్ధంచేశారు.
అంతా గుంతలు ఉండడంతో మట్టిని నింపి సుమారు ఎకరం స్థలంలో వివిధ రకాల మొక్కలు నాటారు. అలాగే కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా బెంచీలను కర్రతో చేయించారు. వాకర్స్కు అనువుగా ఉండేలా వాకింగ్ ట్రాక్ సిద్ధంచేసి, పది రకాల పూల మొక్కలు నాటారు. ప్రకృతి వనాన్ని ఆనుకొని గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయం, రైతువేదిక, మండల పరిషత్ కార్యాలయాలు ఉండడంతో పలు గ్రామాల నుంచి నిత్యం వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇందులో సేదతీరుతారు.
సుమారు రూ.5లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేయగా, అందరికీ ఆహ్లాదం పంచేలా చాలా బాగుందని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గతంలో మురుగునీటి నిల్వలతో దుర్గంధం వెదజల్లి దోమల బెడదతో సీజనల్ వ్యాధులు వచ్చేవని ఇప్పుడలాంటి సమస్యలేవీ లేవని చెబుతున్నారు. అలాగే ఉప్పల్ మేజర్ పంచాయతీలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రభుత్వ దవాఖానను ఆనుకొని సుమారు ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం నిర్మించారు. మొక్కలు ఏపుగా పెరిగి చిన్నపాటి అడవిని తలపిస్తుండడంతో గ్రామ పంచాయతీ మధ్యలో సెంట్రల్ లైటింగ్ అమర్చారు. ఉప్పల్లో రైల్వేస్టేషన్ ఉండడంతో పలు ప్రాంతాలకు రైలులో ప్రయాణం చేసేందుకు ప్రజలు ప్రకృతి వనంలో సేదతీరుతూ కా లక్షేపం చేస్తున్నారు. అలాగే గ్రామానికి చెందిన యువకులు, ఉద్యోగులు, మహిళలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
పల్లె ప్రకృతి వనంలో పది రకాల మొక్కలు నాటించాం. సుమారు 5లక్షలతో కుంటలోని ముళ్ల చెట్లు తొలగించి, ఎర్రమట్టి పోయించాం. ప్రస్తుత ఎండకాలంలో మొక్కలు ఎండిపోకుండా పైపులతో నీళ్లు పడుతున్నాం. మొక్కలు ఏపుగా పెరిగి, రకరకాల పూలు పూస్తున్నాయి.
– రాజారాం, పంచాయతీ కార్యదర్శి
పల్లె ప్రకృతి వనంలో పూలమొక్కలు, షో చెట్లు చాలా బాగున్నాయి. చుట్టూ, మధ్యలో వాకింగ్ ట్రాక్ వేసి చిప్స్ పోశారు. చిప్స్పై సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల పార్కులో గడిపినట్లు ఆనందంగా ఉంది. రకరకాల పూలమొక్కలతో కొత్తగా కనిపిస్తోంది. ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది.
– శివ, ఉప్పల్
ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పల్లె ప్రకృతివనంలో పచ్చని చెట్ల మధ్య కాసేపు గడిపేందుకు వస్తున్నా. రకరకాల మొక్కలు పూలు పూస్తున్నాయి. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు పచ్చగా ఏపుగా పెరిగాయి. పట్టణంలోని పార్కుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది.
– కె.శివ, ఉప్పల్
పబ్లిక్గార్డెన్ను ఎంతో డెవలప్ చేశారు. గతంలో కంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేకంగా వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తున్నా.
– మణిదీప్
పిల్లలతో పబ్లిక్గార్డెన్కు వచ్చాను. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల వస్తువులను అమర్చి ఆధునీకరించారు. నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఒకప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అందరినీ ఆకర్షించేలా విగ్రహాలను పెట్టడంతో కొత్తగా కనిపిస్తోంది.
– మురళీ, రెడ్డికాలనీ