విమానాల రాకపోకలకు అనువుగా మామునూరు ఎయిర్పోర్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రన్వే విస్తరణ, టర్మినల్ భవనం కోసం అవసరమైన స్థలాన్ని సేకరించడంపై దృష్టి సారించింది. ఇటీవల ఎయిర్పోర్టును సందర్శించిన మంత్రి కేటీఆర్ స్థల సేకరణపై ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారులు, కలెక్టర్తో చర్చించారు. రన్వేను 1.8 కి.మీ నుచి 3.9 కి.మీ పొడవుకు విస్తరించాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సూచించారు. రన్వే విస్తరణ, టర్మినల్ కోసం 430 ఎకరాల భూమి సేకరించాలని చెప్పారు. ఈనేపథ్యంలో ప్రతిపాదిత భూసేకరణ కోసం ప్రభుత్వం రెవెన్యూ సర్వేయర్లను నియమించింది. వీరు సర్వే చేసి పంపిన నివేదికను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనుంది.
వరంగల్, మే 11(నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ మామునూరు ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి తీరాలనే పట్టుదతో ఉంది. నిజాం పాలనలో ఇక్కడ ఎయిర్పోర్టు ప్రారంభమైంది. 1981 వరకు డొమెస్టిక్, కార్గొ విమానాలు నడిచాయి. అప్పట్లో ఎయిర్పోర్టుకు 1,875 ఎకరాల భూమి ఉండేది. సమైక్య పాలకులు ఈ భూములను ఇతర అవసరాలకు కేటాయించారు. ప్రస్తుతం 720 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎయిర్పోర్టును అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
వరంగల్ నగర శివారు గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టింది. సుమారు 1,300 ఎకరాల్లో రూపుదిద్దుకొంటున్న ఈ వస్త్ర నగరిలో ఇప్పటికే నార్త్ ఇండియాకు చెందిన గణేశ ఎకో స్పేర్ లిమిటెడ్ కంపెనీ పరిశ్రమలు నిర్మించింది. కంపెనీ నిర్మించిన రెండు యూనిట్లను ఈ నెల 7న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పలు కంపెనీలు క్యూ కడుతున్న తరుణంలో ఈ పార్కులో అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుతున్నది.
మరో 18 నెలల్లో మెగా పార్కులో దాదాపు ఇరవై ఐదు వస్త్ర పరిశ్రమ యూనిట్లు అందుబాటులోకి వస్తాయని, ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప టెంపుల్ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందింది. ఇక బొగ్గుగనుల తవ్వకాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. వరంగల్లో ఆసియాలో రెండో అతి పెద్దదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉంది. వరంగల్ను హెల్త్ సిటీగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఈ క్రమంలో మామునూరు ఎయిర్పోర్టును విమానాలు ఎగిరేలా అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది.
మామునూర్ ఎయిర్పోర్టుకు ప్రస్తుతం ఉన్న స్థలానికి తోడు మరో 430 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. రన్వే కోసం 235, టర్మినల్ భవనం కోసం 195 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇందులో రన్వే కోసం గాడిపల్లి గ్రామం వద్ద, టర్మినల్ భవనం కోసం నక్కలపల్లి గ్రామం వద్ద భూసేకరణకు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి ఈ నెల 7న ఎయిర్పోర్టును సందర్శించారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ కేటీఆర్ వెంట ఉన్నారు. ఎయిర్పోర్టును పరిశీలించిన మంత్రి కేటీఆర్ స్థల సేకరణపై వారితో చర్చించారు. ప్రస్తుతం దీని రన్వే 1.8 కిమీ పొడవు మాత్రమే ఉందని, దీన్ని 3.9 కిమీ పొడవుకు విస్తరించాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సూచించారని తెలిపారు. ఇప్పుడున్న రన్వేలో కేవలం చిన్న సైజు విమానాలు మాత్రమే ల్యాండ్ అవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా బోయింగ్ 743, 747 వంటి విమానాలు దిగేలా ఈ ఎయిర్పోర్టును అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న టర్మినల్ను కూడా వేరే చోటకు మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రన్వే విస్తరణ, టర్మినల్ కోసం భూసేకరణకు సర్వే నిర్వహించాలని, సేకరించాల్సిన 430 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములెన్ని ఉన్నాయి?, ఎవరి నుంచి ఎంత భూమి సేకరించాల్సి ఉంటుంది? అనే వివరాలపై సమగ్ర సర్వే జరిపి నివేదిక రూపొందించాలని సూచించారు. దీంతో ఉన్నతాధికారులు స్థల సేకరణకు సర్వే నిర్వహించడానికి ముగ్గురు రెవెన్యూ సర్వేయర్లను కేటాయించారు. వీరు సర్వే చేసేందుకు సమాయత్తమవుతున్నారు.