ఖిలావరంగల్, మే 11 : కాకతీయుల కళావైభవం నేటికి.. మరెన్నో తరాలకు కనువిందు చేస్తూనే ఉంటుంది. కాకతీయుల ఏలుబడిలో అబ్బురపరిచే అద్భుతాలు ఎన్నెన్నో. అలనాటి చారిత్రక ప్రాశస్త్యం వెలకట్టలేనిది. ఓరుగల్లు కోటలో అద్భుత కట్టడాల శిల్ప సౌందర్యం కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. అలాంటి విశ్వవ్యాప్తమైన కాకతీయుల చారిత్రక కట్టడాలకు తాళాలు వేశారు. కేంద్ర పురావస్తు శాఖ కోటలోని ఆలయాలు, చారిత్రక కట్టడాల పరిరక్షణ పేరుతో ప్రహరీలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమే అయినా వాటికి తాళాలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ప్రచార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా కోటలోని కాకతీయుల శిల్ప కళా సంపద గురించి తెలుసుకుని ప్రత్యక్షంగా వీక్షించి అనుభూతి పొందేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వందల సంఖ్యలో వస్తున్నారు. అయితే వారికి కోటలో అడుగుపెట్టిన తర్వాత ఏ కట్టడం ఎక్కడ ఉందో తెలియక అయోమయం చెందుతున్నారు. అతి కష్టం మీద స్థానికుల ద్వారా ఆలయాలు, ఇతర కట్టడాలకు దారి తెలుసుకొని వెళ్లే సరికి అక్కడ గేట్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. దీంతో పర్యాటకులు పురావస్తు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెను తిరుగుతున్నారు. అలనాటి గుళ్లు, గోపురాలు.. నిర్మాణ సౌధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో వాటికి తాళాలు వేసి పెట్టడంపై పర్యాటకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
చారిత్రక నేపథ్యం కలిగిన కోటలో ఆలయాలు ఎన్నెన్నో.. 365 ఆలయాలు ఉండేవని చరిత్ర పేర్కొంటున్నది. అయితే ప్రస్తుతం మధ్యకోటలోని స్వయంభు శ్రీశంభు లింగేశ్వరస్వామి ఆలయం, కీర్తి తోరణాల మధ్యనున్న వైష్ణవాలయం, ఏకశిలగుట్టపైనున్న రామాలయం మినహాయిస్తే చాల మట్టుకు ఆలయాలు కేంద్ర పురావస్తు శాఖ రికార్డుల్లోనే ఉన్నాయి.
జంగమయ్య గుడి, కొండగుడి, మండలమ్మ ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, నేల శంభునిగుడి, వరాలమ్మ గుడి, కాకతీయుల అశ్వశాలలు, శృంగారం బావి, అక్కచెళ్లల్ల బావులు, సమితుల బావులు, గడియారం బావి, కోడికూతల బావి, ఈసన్న బావి, మందుగుండు తయారీ గది రాతికోట చుట్టూ ఉన్నాయి. అయితే వీటి వద్దకు ఎలా వెళ్లాలి అనే సూచిక బోర్డులు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
అతి కష్టం మీద చారిత్రక కట్టడాల చిరునామ కనుక్కొని వెళ్తే అక్కడ వాటికి తాళం వేసి ఉండడంతో చేసేదేమీ లేక పర్యాటకులు వచ్చిన దారే పడుతున్నారు. కోటలో పదుల సంఖ్యలో చారిత్రక సౌధాలు ఉన్నాయి. అయితే కోట అంటే కేవలం కీర్తితోరణాల మధ్య ఉన్న శిల్ప సంపద, ఖుష్మహల్, ఏకశిలగుట్ట అనే పరిస్థితికి కేంద్రపురావస్తు శాఖ తీసుకువచ్చిందనే విమర్శలున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న సుమారు 8 చారిత్రక కట్టడాల్లో ఖిలావరంగల్ ఒకటి. అయితే ఖిలావరంగల్లో పదుల సంఖ్యలో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకటిగా చేసి కోటకు అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కోటపై పురావస్తు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
వేసవి సెలవుల్లో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం వీకెండ్లో వేల సంఖ్యలో పర్యాటకులు కోటకు వస్తున్నారు. పెరుగుతున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ప్రతి చారిత్రక కట్టడం వద్దకు సులువుగా వెళ్లే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆలయాలు, కట్టడాలకు వేసిన తాళాలను తీసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.