అభివృద్ధి దిశగా పెద్దకొత్తపల్లి
రూ.84 కోట్ల నిధులతో పనులు
మారుతోన్న పల్లెల రూపురేఖలు
ఇంటింటికీ మంచినీటి సరఫరా..
రైతులకు మార్కెట్ నిర్మాణాలు
నాయినోనిపల్లికి ప్రాధాన్యత
నాగర్కర్నూల్, మార్చి 28, నమస్తే తెలంగాణ : రూర్బన్ పథకంతో పెద్దకొత్తపల్లి మండల ముఖ చిత్రం మారిపోనున్నది. రూ.84 కోట్లతో మంచినీరు, గ్యాస్ కనెక్షన్లలాంటి మౌలిక సదుపాయాల నుంచి రోడ్లు, భవనాల్లాంటి శాశ్వత నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనాలు, శీతలీకరణ కేంద్రాలు, ఆడిటోరియం, క్రీడలను ప్రోత్సహించేలా స్టేడియాలు.. ఇవన్నీ రూర్బన్ పథకం ద్వారా మండలంలో జరిగే పలు రకాల శాశ్వత అభివృద్ధి పనులు. రైతులకు అందుబాటులో మార్కెట్లు నిర్మించనున్నారు. ఇక గ్రామాల రూపురేఖలే మారనున్నాయి. నాయినోనిపల్లికి ప్రాధాన్యత ఏర్పడనున్నది. ఇవన్నీ పూర్తయితే రాబోయే కాలంలో ఈ మండలం
జిల్లాలోనే ఆదర్శంగా మారనున్నది.
జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం రూర్బన్ పథకం కింద ఎంపికైంది. రూ.84కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీంతో రాబో యే రోజుల్లో మండలం జిల్లాలోనే ఆదర్శనీయంగా మారనున్నది. ఇందులో భాగంగా సివిల్ సైప్లె శాఖ ద్వారా స్కూళ్లు, అంగన్వాడీలకు గ్యాస్ కనెక్షన్లు, రూ.50లక్షలతో భాషా ప్రయోగశాలల నిర్మాణం చేశారు. పాఠశాలల్లో మంచినీరు, సంప్, పైపులైన్లు, పీవీసీ ట్యాంకులను రూ.50లక్షలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. హార్టి, సెరికల్చర్ శాఖల పరిధిలో రూ.60లక్షలతో శాశ్వత పందిళ్ల నిర్మాణం పూర్తైంది. ప్రతి గ్రామంలో మీ సేవ కేంద్రాలు, మండల కేంద్రంలో రూ.25లక్షలతో డివైడర్, రూ.30లక్షలతో ఆరు బిట్లుగా విద్యుద్దీకరణ పనులు చేశారు. అలాగే మహాసముద్రం, నారాయణపల్లి, సాతాపూర్, మారేడుమాన్దిన్నె, గంట్రావుపల్లి, వెన్నచర్ల, మరికల్, నక్కలపల్లిలో రూ.35లక్షలతో వీధి దీపాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు తొమ్మిది గ్రామాల్లో శ్మశాన వాటికలకు రూ.16లక్షలతో మంచినీటి సదుపాయం కల్పించారు. రూ.26లక్షలతో డంపింగ్ యార్డుల నిర్మాణాలు చేపట్టారు. మండల కేంద్రంలో రూ.30లక్షలతో కొత్తగా పశువైద్యశాలను నిర్మించారు. ఇక పెద్దకొత్తపల్లి, కల్వకోల్, సాతాపూర్, వెన్నచర్లలో బస్స్టాప్ల పనులు జరుగుతున్నాయి. రూ.80లక్షలతో వెన్నచర్ల, కల్వకోల్, సాతాపూర్లో గ్రంథాలయాల నిర్మాణం, యాపట్ల, నారాయణపల్లి, ముష్టిపల్లి, మరికల్, జొన్నలబొగుడ, చిన్నకార్పాములలో బస్షెల్టర్లు, రూ.20లక్షలతో అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు చేపట్టారు. పెద్దకార్పాముల, సాతాపూర్, పెద్దకొత్తపల్లిలో క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నారు. పెద్దకొత్తపల్లిలో కూరగాయల మార్కెట్, సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వెన్నచర్ల, గంట్రావుపల్లి ఆరోగ్య ఉపకేంద్రాల్లో సదుపాయాలు కల్పించనున్నారు. పెద్దకార్పాములలో రూ.2.45కోట్లతో బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రం నిర్మిస్తున్నారు.
రూ.కోటితో పెద్దకొత్తపల్లిలో చేపట్టాల్సిన చేపల కోల్డ్ స్టోరేజ్ పనులు, రూ.4కోట్ల విలువైన సమీకృత ప్రాసెసింగ్ యూనిట్ గోదాం, మామిడి రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు రూ.1.10కోట్ల పనులు, రూ.1.50కోట్లతో చేపట్టనున్న ఆడిటోరియం, కన్వెన్షన్ కేంద్రాల పనులు, కల్వకోల్, వెన్నచర్ల, పెద్దకొత్తపల్లి, సాతాపూర్లో రూ.2కోటితో చేపట్టనున్న మినీ స్టేడియాలు, రూ.1.26కోట్లతో ఆదిరాల, చంద్రబండతండా, దేదినోనిపల్లి, కొత్తయాపట్ల గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలు, రూ.కోటితో నిర్మించే నైపుణ్య అభివృద్ధి కేంద్రం పనులు అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. మండలంలోని ఎంజీకేఎల్ఐ(జొన్నలబొగుడ) రిజర్వాయర్ వద్ద రూ.2కోట్లతో బోటింగ్, చిల్డ్రన్ పార్క్, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది.
పెద్దకొత్తపల్లిలో రూ.కోటితో నిర్మించాల్సిన మినీ స్టేడియం ఇలా రూ.15కోట్ల పనులు ప్రారంభించే దశలో ఉండటం గమనార్హం. జిల్లాలో భక్తుల ఆరాధ్యదైవమైన మైసమ్మ కొలువైన నాయినోనిపల్లికి ప్రత్యేక ప్రాధాన్యతతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రూ.20లక్షలతో మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. రూ.5లక్షలతో అన్నదాన సత్రం నిర్మాణం చేపట్టారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మార్కెటింగ్ కాంప్లెక్స్ను రూ.76లక్షలతో నిర్మించారు. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.60లక్షలతో ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. అలాగే రూ.20లక్షలతో మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రూ.15లక్షలతో పార్క్ నిర్మాణం చేపట్టనుండగా స్థలం కోసం అన్వేషిస్తున్నారు. ఇలా రూ.84కోట్లకుగానూ రూ.10కోట్ల పనులు జరిగాయి. రూర్బన్ పథకంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే మండల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది.
వేగంగా పూర్తయ్యేలా చర్యలు
రూర్బన్ పథకంలో భాగంగా రూ.84కోట్లతో మండలంలో పలు అభివృద్ధి పను లు చేపడుతున్నాం. ఇప్పటివరకు రూ.9కోట్లకుపైగా పనులు చేపట్టాము. స్థల సేకరణతో కొన్ని పనులు చేపట్టలేకపోతున్నాం. ముఖ్యంగా రూ.5కోట్లతో చేపట్టనున్న రెండు శీతలీకరణ కేంద్రాలు, మామిడి మార్కెటింగ్ సదుపాయాల కల్పన, రూ.150కోట్లతో పెద్దకొత్తపల్లిలో ఆడిటోరియం, నాలుగు గ్రామాల్లో మినీ స్టేడియాలు, రూ.1.26కోట్ల విలువైన పంచాయతీ భవనాలు, జొన్నలబొగుడలో రూ.కోటితో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
నిద్రపట్టట్లేదా.. ఈ పండ్లు తినండి!