వరంగల్లో నిర్వహించే విజయ గర్జనకు, హైదరాబాద్లో జరిగే ప్లీనరీకి టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ రెండు దశాబ్దాల ఉత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణ భారీగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి,
ఎమ్మెల్యేల సారథ్యంలో నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలను భారీగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క వనపర్తి జిల్లా నుంచే 10 వేల మందిని తరలించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇందుకోసం గురువారం జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
వనపర్తి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు జిల్లా నుంచి గులాబీ శ్రేణులు కదం తొక్కేలా చర్యలు చేపడుతున్నారు. ద్విదశాబ్ది ఉత్సవాలను కనీవిని ఎరుగుని రీతిలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ అదిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎప్పటి మాదిరిగానే జన సమీకరణ భారీగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీకీ పార్టీ ముఖ్య నాయకులతో హాజరవుతుండగా, ద్విదశాబ్ది వేడుకలకు గులాబీ దండు భారీగా కదిలి వచ్చేలా మంత్రి పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా, ఈ నెల 23న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఎమ్మెల్యేల సారథ్యంలో మంత్రి నిరంజన్రెడ్డి నియోజకవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్లీనరీకీ పరిమిత సంఖ్యలో అనుమతి ఉన్నందున ప్రతి జిల్లా నుంచి దాదాపు 60 మంది నాయకులు వెళ్లనున్నారు.
మంత్రి నిరంజన్రెడ్డి దిశా నిర్దేశం
నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో విజయగర్జనకు సంబంధించి మంత్రి నిరంజన్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అంతకంటే ముందు ప్రతి మండలంలో టీఆర్ఎస్ శ్రేణులతో బేటీ కానున్నారు. ఇప్పటికే చాలా మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. సన్నాహ క సమావేశాల్లో అందరు ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలను భాగస్వాములు చేయనున్నారు. విజయ గర్జన సభకు తీసుకోవాల్సిన బాధ్యతలు అప్పగించనున్నారు.
వనపర్తి నుంచి 10 వేల మంది..
వనపర్తి జిల్లా నుంచి పది వేల మంది విజయగర్జన సభకు హాజరుకానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దాదాపు లక్ష మందికి పైగా వెళ్లనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపడుతున్నాం. సభకు వచ్చేందుకు సామాన్య జనం కూడా ఆసక్తి చూపుతున్నారు. అందరినీ ఎలాంటి లోటు లేకుండా తీసుకెళ్తాం. మండలాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో విజయగర్జన సభ గులాబీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనున్నది. ఇటీవల సంస్థాగతంగా కూడా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. సభ విజయవంతానికి కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి.