కడ్తాల్, సెప్టెంబర్ 23: పంచాయతీల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులతో మైసిగండి గ్రామం రూపురేఖలు మారిపోయాయి. మైసిగండిలో 530 ఇండ్లు, 2,035 జనాభా, 1,366 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతి రాకముందు గ్రామంలో ఎన్నో సమస్యలు ఉండేవి. పల్లె ప్రగతిలో భాగంగా మైసిగండి ఎంతో అభివృద్ధి సాధించింది. గ్రామంలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి. మౌలిక వసతులు సమకూరాయి. దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న అభివృద్ధి కేవలం రెండేండ్లలోనే జరుగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పంచాయతీ ట్రాక్టర్తో రోజూ కాలనీల్లోని చెత్తాచెదారాన్ని ఇంటింటికీ తిరిగి సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కనిపించకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. దీంతో పల్లె పరిశుభ్రంగా కనిపిస్తున్నది.
పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులు
పల్లె ప్రగతి కార్యక్రమంతో ఊరంతా మారిపోయింది. మైసిగండి గ్రామంలో రూ.75 లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. గ్రా మంలో రూ.12.60 లక్షలతో వైకుంఠధా మం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు నిర్మించారు. రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేశారు. రూ.3 లక్షల వ్యయంతో గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేసి, అందులో 3,500 మొక్కలు నాటా రు. వాకింగ్ ట్రాక్ కూడా నిర్మించారు. జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, బాదాం, ఉసిరితోపాటు వివిధ రకాల పూల మొక్కలు నాటారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటుచేసి, వాటి ద్వారా తాగునీటిని అందించేందుకు రూ.15 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. రూ.3 లక్షలతో ప్రతి కాలనీలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని కాలనీల్లో రోడ్లకిరువైపులా మొక్కలు నాటి, పంచాయతీకి ట్యాంకర్తో నీళ్లు పోసి, వాటిని సంరక్షిస్తున్నారు.
ఊరు ఎంతో మారింది..
తెలంగాణ సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మా ఊరు ఎంతో మారింది. ఊర్లో అన్ని వసతులు సమకూరాయి. ప్రభు త్వ సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. హరితహారం, పల్లె ప్రకృతి వనంతో గ్రామం కొత్తగా కనిపిస్తున్నది. ఎటూచూసినా అద్దంలా మెరుస్తున్నది. ప్రగతి కార్యక్రమంతో గ్రామంలో ఎంతో అభివృద్ధి జరిగింది.
హర్యానాయక్, గ్రామస్తుడు, మైసిగండి
పల్లె ప్రగతితోనే అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రా మం రూపురేఖలు మారిపోయా యి. అభివృద్ధితోపాటు ఎంతో మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుంటూ, గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. అభివృద్ధిలో గ్రామాన్ని మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అందరి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం.
తులసీరాంనాయక్, సర్పంచ్, మైసిగండి
అందరి సహకారంతో అభివృద్ధి
గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలో అభివృద్ధి జరిగింది. ప్రభుత్వ నిధులకు తోడు స్థానికులు అందిచిన సహాయ సహకారాలతో పనులను సకాలంలో పూర్తిచేశాం. పల్లె ప్రగతిలో జరిగిన అభివృద్ధితో ఊరంతా పరిశుభ్రంగా మారింది. గ్రామంలో నిత్యం పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నాం.
సత్యం, పంచాయతీ కార్యదర్శి, మైసిగండి