పట్టణాల్లోని భవనాల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ చేసేందుకు రాష్ట్ర సర్కార్ భువన్ సర్వే చేపట్టింది. ఇందులో పరిగి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అధికారులు బృందాలుగా ఏర్పడి ఇండ్ల కొలతలు, ఖాళీ స్థలాల విస్తీర్ణం తదితర వివరాలను ఫొటోలతో సహా వేగవంతంగా సేకరిస్తుండడంతో ఇది సాధ్యమైంది. పన్నుల చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలనే లక్ష్యంతో సర్కారు ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేపడుతున్నది. పరిగి మున్సిపాలిటీ భువన్ సర్వేను వేగవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలోనే టాప్లో నిలువగా.. కొడంగల్ మున్సిపాలిటీ 9వ స్థానం దక్కించుకున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలోని రెండు మున్సిపాలిటీలు టాప్ టెన్లో నిలువడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పరిగిలో ఇప్పటివరకు 99.51శాతం భవనాలకు జియో ట్యాగింగ్ పూర్తయింది. మొత్తం 5490 ఇండ్లు ఉండగా ఇప్పటివరకు 5463 ఇండ్ల వివరాల సేకరణ పూర్తి చేశారు. అలాగే కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 3827 ఇండ్లు ఉండగా ఇప్పటివరకు 3736 ఇండ్లకు జియో ట్యాగింగ్(97.62శాతం) పూర్తయింది.
పరిగి, అక్టోబర్ 21 : పట్టణాల్లో ఇండ్లకు సంబంధించిన భువన్ అసెస్మెంట్, జియో ట్యాగింగ్కు సంబంధించి పరిగి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నం.1 స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇండ్లకు జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించిన సర్కారు.. గత ఏడాది జూలైలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పన్నుల చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలనే ధ్యేయంతోనే సర్కారు ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేపడుతున్నది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో మున్సిపల్ శాఖ ఈ మేరకు ఒప్పందం చేసుకున్నది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో భువన్ యాప్ ద్వారా పట్టణాల్లోని ప్రతి ఇంటికి సంబంధించిన వివరాలు సేకరించి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో పనిచేసే బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బందిని ప్రత్యేక టీంలుగా ఏర్పాటు చేసి భువన్ యాప్లో నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో భువన్ యాప్లో ఇండ్ల వివరాల నమోదు, జియో ట్యాగింగ్లో పరిగి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువడం గమనార్హం.
టాప్ టెన్లో రెండు మున్సిపాలిటీలు..
భువన్ అసెస్మెంట్, జియో ట్యాగింగ్లో వికారాబాద్ జిల్లా పరిధిలోని రెండు మున్సిపాలిటీలు టాప్ టెన్లో నిలువడం గమనార్హం. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అందులో రెండు మున్సిపాలిటీలు మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. పరిగి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నం.1 స్థానంలో నిలిచింది. పరిగిలో ఇప్పటివరకు 99.51శాతం ఇండ్ల జియో ట్యాగింగ్ పూర్తయింది. పరిగి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 5490 ఇండ్లుండగా ఇప్పటివరకు 5463 ఇండ్లకు సంబంధించిన జియో ట్యాగింగ్ పూర్తయింది. 27 ఇండ్ల జియో ట్యాగింగ్ చేపట్టాల్సి ఉన్నది.
మరోవైపు జిల్లాలోని కొడంగల్ మున్సిపాలిటీ 9వ స్థానంలో నిలిచింది. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 3827 ఇండ్లుండగా ఇప్పటివరకు 3736 ఇండ్లకు సంబంధించిన జియో ట్యాగింగ్(97.62శాతం) పూర్తి చేయడం ద్వారా 9వ స్థానం దక్కించుకుంది. ఈ మున్సిపాలిటీలో 91 ఇండ్ల జియో ట్యాగింగ్ చేపట్టాల్సి ఉన్నది. ఈ రెండు మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడినవి కావడం గమనార్హం. ఇదిలావుండగా జిల్లా పరిధిలోని వికారాబాద్ మున్సిపాలిటీలో 13,886 ఇండ్లుండగా 13,045 (93.94శాతం), తాండూరు మున్సిపాలిటీలో 12,525 ఇండ్లకుగాను ఇప్పటివరకు 5779 ఇండ్ల జియో ట్యాగింగ్ (46.14శాతం) పూర్తయింది.
ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశం
భువన్ యాప్లో వివరాల నమోదు, ఇండ్ల జియో ట్యాగింగ్ను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ అధికారులు ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన జియో ట్యాగింగ్ ఇండ్లు మినహా మిగతా వాటిలో రోజువారీ లక్ష్యం నిర్దేశించారు. అందుకనుగుణంగా ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక టీంలు జియో ట్యాగింగ్ను వేగవంతం చేయాలని నిర్దేశించారు. ప్రతి ఇంటికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారు, ఎంత ఖాళీ స్థలం ఉన్నది, ఇల్లు ఎన్ని అంతస్తులు ఉన్నది పూర్తిస్థాయిలో కొలతలు చేసి నమోదు చేయడంతోపాటు ఫొటోను భువన్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఇల్లు గృహావసరాలకు వినియోగించబడుతుందా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా లేదా రెండు రకాలుగా వినియోగిస్తున్నారా.. తదితర అంశాలు సైతం పొందుపరచడంతోపాటు జీపీఎస్లో లొకేషన్ సైతం షేర్ చేస్తారు. తద్వారా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో గల ప్రతి ఇంటికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. ఈ కార్యక్రమం వేగవంతం చేయడంపై మున్సిపల్ శాఖ దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోని ఇండ్లకు జియో ట్యాగింగ్ చేసిన రాష్ట్రంగా నిలిచేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని వేగిరం చేశారు. తద్వారా ఇంటి పన్నుల అసెస్మెంట్ సక్రమంగా ఉండేలా ఇది ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
సమష్టిగా పనిచేయడం వల్లే రాష్ట్రస్థాయి గుర్తింపు